హైదరాబాద్ ఫిబ్రవరి 8
ఏపీ సీఎం జగన్ చెల్లెలు షర్మిల కీలక అడుగులు వేస్తున్నట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో రేపు వైఎస్ షర్మిల కీలక సమావేశం నిర్వహిస్తున్నారు.అయితే అజెండా ఏమిటనేది మాత్రం బయటకు వెల్లడికాలేదు. కానీ తెలంగాణలో కొత్త పార్టీ దిశగా వైఎస్ షర్మిల ఈ కీలక సమావేశం నిర్వహిస్తున్నట్టు భోగట్టా. వైఎస్ఆర్ అభిమానులు ఈ సమావేశానికి రావాల్సిందిగా నేతలకు స్వయంగా కాల్ చేసి మరీ ఆహ్వానిస్తున్నారు.షర్మిల కొత్త పార్టీని తెలంగాణలో స్థాపించబోతున్నారని.. ఈ నేపథ్యంలోనే రేపటి భేటికి ప్రాధాన్యత ఏర్పడిందని అంటున్నారు.ఇప్పటివరకు షర్మిల పార్టీ పెట్టడంపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే.. వీటిని ఇటీవల షర్మిల ఖండించారు కూడా.. కానీ అవే నిజం కాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ఊహాగానాలు మరికొద్ది రోజుల్లో నిజం కాబోతున్నట్లు సమాచారం. అంతేకాదు.. షర్మిల పార్టీ ప్రకటనపై తేదీ కూడా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఈనెల 9న అంటే వైఎస్ రాజశేఖర్రెడ్డి విజయమ్మల పెళ్లి రోజు సందర్భంగా ఈ పార్టీ ప్రకటన ఉండవచ్చనేది సమాచారం అందుతోంది. అందుకే రేపే కీలక సమావేశానికి షర్మిల రెడీ కావడం ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? వైఎస్సార్ రాజకీయ వారసురాలిగా తెలంగాణలో పార్టీ పెట్టబోతున్నారా..? ఆ పార్టీకి ఇప్పటికే పేరు కూడా డిసైండ్ అయిందా..? పార్టీ జెండా కూడా రూపుదిద్దుకుందా..? ఇందుకు ముహూర్తం కూడా ఖరారైందా..? త్వరలోనే విధివిధానాలు వెల్లడికానున్నాయా..? ప్రస్తుతం వైఎస్ షర్మిల అడుగులు చూశాక తెలంగాణ రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్ అయింది.