పీఓకేలో మరోసారి పాకిస్తాన్ దళాల దురాగతం
శ్రీనగర్ ఫిబ్రవరి 10
పాకిస్తాన్ దళాలు పీఓకేలో మరోసారి చెలరేగాయి. పౌరులపై కాల్పులు జరపటంతో పాటు ఆ ప్రాంతంలో మహిళలు, పిల్లలను అపహరించాయి.బెలూచిస్తాన్లోని నివాస ప్రాంతాల్లో పాక్ సైనికులు కాల్పులు జరిపారని బలూచ్ రిపబ్లికన్ పార్టీ పేర్కొంది. కొహిస్తాన్ మారి ప్రాంతంలో పౌర ఆవాసాలపై పాక్ దళాలు కాల్పులకు తెగబడుతున్నాయని బలూచ్ రిపబ్లికన్ పార్టీ ప్రతినిధి షేర్ మహ్మద్ బుగ్తి పేర్కొన్నారు. పాక్ దళాల కాల్పుల్లో ఇద్దరు పౌరులు మరణించారని, పెద్ద సంఖ్యలో మహిళలు, పిల్లలను అపహరించారని ఆందోళన వ్యక్తం చేశారు.మరోవైపు స్ధానికులపై, పిల్లలపై పాకిస్తాన్ సైన్యం తుపాకీలు గురిపెట్టిన పోస్టులు సోషల్ మీడియాలో కనిపించాయి. సైనిక దుస్తుల్లో పలువురు పాక్ సైనికులు పెద్దగా అరుస్తూ పౌరులపై కాల్పులు జరుపుతున్న వీడియోలు ట్విటర్లో దర్శనమిచ్చాయి. పాక్ ప్రభుత్వం, మిలటీరీ ఇంతవరకూ ఈ వార్తలపై స్పందించలేదు. బెలూచిస్తాన్, పీఓకేలోని ఇతర ప్రాంతాల్లో స్ధానికులపై పాక్ సైన్యం ఆగడాలు కొత్తేం కాదు. గతంలోనూ భారత్ పలు అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని పలుమార్లు గొంతెత్తింది.