కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భారత భూభాగాన్ని ప్రధాని మోదీ చైనాకు అప్పగించారు అని రాహుల్ ఆరోపించారు. దీనిపై దేశ ప్రజలకు మోదీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. నిన్న రాజ్యసభలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.. తూర్పు లఢక్ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు, ప్రస్తుత పరిణామాలపై ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై రాహుల్ గాంధీ స్పందించారు. భారత సైన్యం ఫింగర్ 4 నుంచి ఫింగర్ 3కి చేరుకుంటుంది అని తెలుసుకున్నాం. ఫింగర్ 4 మన భూభాగ పరిధి అయినప్పటికీ ఫింగర్ 3కి ఎందుకు తరలివస్తున్నారు. మోదీ భారత భూభాగాన్ని చైనాకు ఎందుకు అప్పగిస్తున్నారని రాహుల్ ప్రశ్నించారు. చైనా ప్రవేశించిన డెప్సాంగ్ మైదానాలపై రాజ్నాథ్ సింగ్ మాట్లాడలేదని తెలిపారు. మొత్తానికి ప్రధాని మోదీ భారత సైన్యం త్యాగాలను పక్కనపెట్టి, ద్రోహం చేస్తున్నారని రాహుల్ మండిపడ్డారు. ఇటువంటి చర్యలను భారత ప్రజలు ఎవరూ కూడా ప్రోత్సహించొద్దు అని రాహుల్ గాంధీ సూచించారు.