విజయవాడ, ఫిబ్రవరి 13,
పంచాయతీ ఎన్నికలను ముందుకు తెచ్చి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుగుదేశం పార్టీ నెత్తిన పాలు పోశారు. వైసీపీ ఊహించినట్లే జరుగుతుంది. గ్రామాల్లో కక్షలు ప్రారంభమయ్యాయి. సర్పంచ్, వార్డు పదవుల కోసం గ్రూపులుగా విడిపోయారు. అధికార వైసీపీలోనే గ్రూపులు మొదలయ్యాయి. చంద్రబాబుకు కావాల్సిందిదే. ఇప్పటి వరకూ జగన్ ప్రభుత్వంపై నిరసనను తెలపడానికి కూడా భయపడిన టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తుండటంతో చంద్రబాబులో ఉత్సాహం రెట్టింపయింది.అందుకే తొలి నుంచి పంచాయతీ ఎన్నికలను జరపవద్దంటూ వైసీపీ గోల గోల చేసింది. అయినా న్యాయస్థానం ఉత్తర్వులతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్యలో ఆగిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను జరపకుండా పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీనికి వైసీపీ అభ్యంతరం చెబుతున్నా పట్టించుకోకుండా ముందుకు వెళ్లారు. అదే ఇప్పడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కలిసి వచ్చిందిబలవంతపు ఏకగ్రీవాలు అనేక చోట్ల జరిగినప్పటికీ అక్కడ టీడీపీ వర్గం మరింత పటిష్టమయిందన్నది వాస్తవం. పంచాయతీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నిత్యం వారితో మాట్లాడుతుండటం, వైసీపీ నేతలు దాడులు చేసిన నేతలతో నేరుగా ఫోన్ లో టచ్ లోకి వెళుతుడటం వంటివి పార్టీ క్యాడర్ లో ధైర్యాన్ని నింపాయంటున్నారు. పంచాయతీ ఎన్నికలు, పార్టీ గుర్తులేని ఎన్నికలు అని వదిలేయకుండా చంద్రబాబు దీనికోసం అంతర్గత కమిటీలను నియమించారు.న్యాయ సలహలు, సహకారం ఉచితంగా ఇచ్చేందుకు ఇరవై నాలుగు గంటలు పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ లీగల్ సెల్ ను అందుబాటులో ఉంచారు. కేంద్ర కార్యాలయానికి అందిన సమాచారం ప్రకారం అన్ని జిల్లాల్లో గ్రామాల వారీగా పార్టీ నేతలు రోడ్లపైకి వస్తున్నారన్న నివేదికలు చంద్రబాబులో ఆనందాన్ని నింపాయి. చంద్రబాబు కోరుకున్నదీ ఇదే. ఇరవై నెలలుగా జరగనది కేవలం ఇరవై రోజుల్లోనే పరిస్థితి మారిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద పంచాయతీ ఎన్నికలు టీడీపీలో జోష్ ను నింపాయని చెప్పక తప్పదు.