YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఈ సారి ఎదురీతేనా

ఈ సారి ఎదురీతేనా

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15, 
సెంబ్లీ ఎన్నికల వేళ మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీకి ఇబ్బంది కరంగా మారనున్నాయి. గత ఏడేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి ఇటు పల్లెలు, అటు పట్టణాల్లో సయితం పార్టీ పట్ల వ్యతిరేకత కన్పిస్తుందంటున్నారు. ఈ ఏడాది తమిళనాడు, అసోం, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా తదితర రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి.
ఈ ఎన్నికల్లో బీజేపీ విజయానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలే అడ్డంకిగా మారే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ప్రధానంగా పట్టణ ప్రజల్లో మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కన్పిస్తుంది. పెట్రోలు, డీజిల్ ధరలను విపరీతంగా పెంచడం, నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటడం వంటి కారణాలతో పట్టణ ప్రజలు మోదీ ప్రభుత్వంపై అసహనంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడూ ఇలా పెట్రో ధరలు పెంచలేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.ఈ ప్రభావం రాజస్థాన్ మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టంగా కన్పించింది. అక్కడ మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం విశేషం. మున్సిపల్, కార్పొరేషన్ ప్రాంతాల్లో బీజేపీ గెలుపొందలేకపోవడానికి ప్రధాన కారణం పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగడమే కారణమన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. బీజేపీ నేతలు సయితం ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానానికి నివేదికలు అందించినట్లు తెలిసింది. ఇదే పరిస్థితి దేశమంతా ఉండే అవకాశం ఉందంటున్నారు.ఇక రైతు సమస్యలతో గ్రామీణ భారతం సయితం మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే అవకాశం కన్పిస్తుంది. కేవలం మాటలు, సూక్తులు చెప్పి ఆచరణలో పేద, మధ్య తరగతి ప్రజలను పట్టించుకోని మోదీ ప్రభుత్వం పట్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వ్యతిరేకత కన్పిస్తుండటం ఆపార్టీ భవిష‌్యత్ విజయాలపై ప్రభావం చూపుతుందంటున్నారు. ఈ వ్యతిరేకత మరింత పెరిగే అవకాశముందంటున్నారు. ఏడేళ్ల పాటు మోదీ ప్రజలను భ్రమల్లోనే ఉంచారని, ప్రజలకు చేసిందేమీ లేదన్న వ్యాఖ్యలు సర్వత్రా విన్పిస్తున్నాయి. దీనిని కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకోగలిగితే దానికి పూర్వ వైభవం దక్కే అవకాశాలున్నాయి.

Related Posts