అసత్యాలు ప్రచారం చేస్తున్న చంద్రబాబు
- సజ్జల రామకృష్ణారెడ్డి
విజయవాడ ఫిబ్రవరి 15,
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ముఖ్యనేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలో టీడీపీ పూర్తిగా కనుమరుగైందని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు పార్టీ నుంచి వెళ్లిపోకూడదని భావిస్తున్న చంద్రబాబు.. వారిలో భ్రమలు కల్పించే పనిలో పడ్డారని ఆరోపించారు. అసత్యాలు, అబద్దాలను బరితెగించి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు తీసుకొచ్చిన ఎస్ఈసీనే ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని చెప్పారని గుర్తు చేశారు. వైసీపీ పార్టీ వెబ్సైట్కు ఫేక్గా టీడీపీ మరో వెబ్సైట్ను సృష్టించిందని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చంద్రబాబునాయుడు ఫేక్ వెబ్సైట్తో ప్రజలను మోసం చేయటానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
టీడీపీ ఫేక్ వెబ్సైట్పై సీఐడీకి పార్టీ తరఫున ఫిర్యాదు చేశామని అన్నారు. చంద్రబాబు ప్రజల తీర్పును చాలా నీచంగా వక్రీకరిస్తున్నారని విమర్శించారు. అసత్యాలు, అబద్దాలను బరితెగించి ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ పాలనలో అందరకీ సంక్షేమ ఫలాలు అందాయని... పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పే ఇందుకు ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు. రెండో విడత ఎన్నికల్లో కూడా 80 శాతం విజయం సాధించామని చెప్పుకొచ్చారు.