హైదరాబాద్, ఫిబ్రవరి 16,
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) మేయర్గా బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్గా తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలత ఎన్నికైన సంగతి తెలిసిందే..! విజయలక్ష్మికి శుభాకాంక్షలు చెబుతూ పెద్ద ఎత్తున మద్దతుదారులు బ్యానర్లను ఏర్పాటు చేశారు. కానీ ఎక్కడపడితే అక్కడ బ్యానర్లను ఏర్పాటు చేసిన అభిమానికి జీహెచ్ఎంసీ భారీ షాక్ ను ఇచ్చింది.
మేయర్ విజయలక్ష్మికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె అనుచరుడు అతిష్ అగర్వాల్ హైదరాబాద్ నగరంలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. దాదాపు 15 అడుగుల ఫ్లెక్సీలను ఉంచాడు. ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై నగర పౌరుడు ట్విట్టర్లో జీహెచ్ఎంసీ అధికారులను ప్రశ్నించాడు. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు.. ఫ్లెక్సీలు అనధికారికంగా ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన అతిష్ అగర్వాల్పై అధికారులు కొరడా ఝళిపించింది. భారీ ఫైన్ ను వేసింది. ఈ వ్యవహారంలో మేయర్ రూల్ ప్రకారమే అందరూ నడుచుకోవాలని అన్నారు విజయలక్ష్మి. తనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన షేక్పేట ఎమ్మార్వో శ్రీనివాసరెడ్డిపై బదిలీ వేటు పడడంతో మేయర్ మరోసారి వార్తల్లోకెక్కారు. తనపై దౌర్జన్యం చేశారంటూ పోలీసులను ఆశ్రయించిన ఎమ్మార్వో శ్రీనివాసరెడ్డి అనూహ్యంగా బదిలీ అయ్యారు. మేయర్ విజయలక్ష్మి పదవి చేపట్టిన రెండు రోజులకే బదిలీ ఉత్తర్వులు వెలువడడంతో తనపై కేసు పెట్టినందుకే ఎమ్మార్వోను ఇలా బదిలీ చేశారని ప్రచారం జరుగుతోంది. తనను బండబూతులు తిట్టడమే కాక విధులకు ఆటంకం కలిగించారని.. కోర్టుకు వెళ్లకుండా అడ్డుకున్నారని అప్పట్లో కార్పొరేటర్ గా ఉన్న గద్వాల విజయలక్ష్మి పై ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారట.
గతంలో విజయలక్ష్మిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మార్వో శ్రీనివాసరెడ్డిని సీసీఎల్ ఏకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో తనకు అనుకూలురైన రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న తహశీల్దార్ కె.వెంకట్ రెడ్డి నియమించారనే కథనాలు కూడా వస్తున్నాయి. పైకి సాధారణ బదిలీగానే కనిపించినా.. రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. మేయరైన రెండు రోజుల్లోనే ఆమె వివాదాల్లో చిక్కుకున్నారు. అమావాస్య రోజు ప్రమాణ స్వీకారమే అందుకు కారణమని ప్రచారం జరుగుతోంది.