కలకలం రేపుతోన్న జీవీఎంసీ కమిషనర్ సృజన ఆకస్మిక బదిలీ
అమరావతి ఫిబ్రవరి 17
మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియను చేపట్టడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ఏర్పాట్లు చేస్తోన్న క్రమంలో జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ గుమ్మళ్ల సృజన అర్ధరాత్రి ఆకస్మిక బదిలీ వ్యవహారం కలకలం రేపుతోంది. జీవీఎంసీ కమిషనర్ గా నాగలక్ష్మి సెల్వరాజన్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు మార్చినట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు.ఇప్పటికే జీవీఎంసీ కమిషనర్ సృజన రెండు రోజులు సెలవులో వెళ్లారు. జీవీఎంసీ ఎన్నికలు వస్తున్న తరుణంలో నెల రోజులు సెలవు కావాలంటూ సృజన కోరడం తదుపరి బదిలీ చేయడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆమెను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. 2012 బ్యాచ్ ఐఎఎస్ అధికారిణి నాగలక్ష్మి నియామకానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంగీకారం వ్యక్తం చేశారు. నాగలక్ష్మితో పేరును సూచిస్తూ సాధారణ పరిపాలన శాఖ ప్యానెల్ పంపించిన ప్రతిపాదనలపై ఆయన ఆమోదముద్ర వేశారు. ఆ వెంటనే ఆమెను జీవీఎంసీ కమిషనర్గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.