YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

త్రిమూర్తులు, నర్సింహం ఫ్యామిలీకి ట్రబుల్స్

త్రిమూర్తులు, నర్సింహం ఫ్యామిలీకి  ట్రబుల్స్

కాకినాడ, ఫిబ్రవరి 18,  
వారిద్దరు నాటి స‌మైక్య రాష్ట్రం నుంచి.. నేడు రాష్ట్రం విడిపోయాక కూడా రాజ‌కీయాలను శాసించ‌డంతో పాటు ఓ వెలుగు వెలిగారు. రెండు బ‌ల‌మైన కుటుంబాలకు చెందిన వారు ప‌లు పార్టీలు మారి చివ‌ర‌కు ఇప్పుడు అధికార వైఎస్సార్‌సీపీలో ఉన్నారు. గ‌త ఐదేళ్లు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప‌ద‌వులు అనుభ‌వించిన వీరిలో ఒక‌రు ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీలో చేరి పోటీ చేసి ఓడిపోగా మ‌రొక‌రు ఎన్నిక‌ల్లో ఓడి అనంత‌రం వైసీపీలో చేరారు. ఇప్పుడు ఈ ఇద్దరికి అధికార పార్టీలో అంత ప్రయార్టీ ల‌భించ‌డం లేద‌నే చెప్పాలి. వారిలో ఒక నేత‌ను వైసీపీ అధిష్టాన‌మే వ్యూహాత్మకంగా సైడ్ చేసేస్తే మ‌రో నేత‌ను చాలా సైలెంట్‌గా వ్యూహాత్మకంగా నియంత్రిస్తోంది. ఆ ఇద్దరు నేత‌లు కూడా తూర్పు గోదావ‌రి జిల్లాలో బ‌ల‌మైన కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన వారే. వారే మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత అమ‌లాపురం పార్లమెంట‌రీ పార్టీ అధ్యక్షుడు తోట త్రిమూర్తులు.. మ‌రో నేత మాజీ మంత్రి, మాజీ ఎంపీ తోట న‌ర‌సింహం, ఆయ‌న భార్య తోట వాణి.వీరిలో తోట న‌ర‌సింహం గ‌త టీడీపీ ప్రభుత్వంలో కాకినాడ ఎంపీగా ఉన్నారు. తోట త్రిమూర్తులు రామ‌చంద్రాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. తోట న‌ర‌సింహం ఫ్యామిలీ ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీలోకి జంప్ చేసి త‌మ సొంత నియోజ‌క‌వ‌ర్గం జ‌గ్గంపేటలో పోటీ చేయాల‌నుకున్నా.. జ‌గ‌న్ మాత్రం పెద్దాపురం సీటు ఇచ్చారు. ఎన్నిక‌ల్లో పోటీ చేసిన న‌ర‌సింహం భార్య తోట వాణి పెద్దాపురంలో మాజీ హోం మంత్రి నిమ్మకాయ‌ల చిన‌రాజ‌ప్ప చేతిలో ఓడిపోయారు. పార్టీ బంప‌ర్ మెజార్టీతో అధికారంలోకి రావ‌డంతో తోట ఫ్యామిలీకి ప‌ద‌వి లేక‌పోవ‌డం వారికి ప్రశాంత‌త లేకుండా చేసింది. వెంట వెంట‌నే త‌మ‌కు ప‌ద‌వులు కావాల‌ని అధిష్టానాన్నే బెదిరించే ధోర‌ణిలో మాట్లాడారు. విసిగిపోయిన పార్టీ ముఖ్యులు పెద్దాపురం పార్టీ ప‌గ్గాలు ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ఇన్‌చార్జ్‌గానే ఉన్న ద‌వులూరి దొర‌బాబుకు క‌ట్టబెట్టి తోట ఫ్యామిలీని సైడ్ చేసేసి.. మీరు పార్టీలో ఉన్నా ఒక‌టే .. లేక‌పోయినా ఒక్కటే అని చెప్పక‌నే చెప్పేశారు. అప్పటి నుంచి తోట ఫ్యామిలీ అడ్రస్ ఎక్కడుందో తెలియ‌ని ప‌రిస్థితి. మ‌ధ్యలో బీజేపీలోకి వెళ్లే ఆలోచ‌న‌లో కేంద్ర మాజీ మంత్రి సుజ‌నా చౌద‌రితో పాటు కొంద‌రు కీల‌క నేత‌ల‌ను క‌లిసి హ‌డావిడి చేశారని టాక్ ? ఇవ‌న్నీ తెలిసే వైసీపీ అధిష్టానం ప‌క్కన పెట్టేసింది.ఇక రామ‌చంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఎన్నిక‌ల‌కు ముందే చంద్రబాబును క‌లిసి రెండు సీట్లు కావాల‌ని బెదిరించారు. రామ‌చంద్రాపురంతో పాటు త‌న త‌న‌యుడికి కాకినాడ రూర‌ల్ సీటు కోసం ప‌ట్టుబ‌ట్టారు. చంద్రబాబు ఒక సీటే ఇవ్వగా ఆయ‌న ఓడిపోయారు. త‌ర్వాత త‌న వియ్యంకుడు అయిన విప్‌, జ‌గ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉద‌య‌భాను చ‌క్రం తిప్పి తోట‌ను వైసీపీలోకి లాగేశారు. రామ‌చంద్రాపురంలో రాజ్యస‌భ సభ్యుడు పిల్లి బోస్‌, మంత్రి చెల్లుబోయిన వేణు వ‌ర్గాలు తోట త్రిమూర్తులు పార్టీలో చేర‌డాన్ని అడ్డుకున్నా జ‌గ‌న్ తోట‌ను పార్టీలో చేర్చుకున్నారు. వెంట‌నే ఆయ‌న‌కు అమ‌లాపురం పార్లమెంట‌రీ పార్టీ ప‌గ్గాలు ఇవ్వడంతో పాటు బోస్ రాజ్యస‌భ‌కు వెళ్లడంతో మండ‌పేట పార్టీ ప‌గ్గాలు కూడా ఇచ్చారు.తోట త‌న‌కు ఎమ్మెల్సీ వ‌స్తుంద‌ని ఆశ‌లు పెట్టుకున్నా ఆయ‌న ఆశ‌లు నెర‌వేరే ఛాన్సే లేదు. త్రిమూర్తుల‌కు మండ‌పేట‌లో ఏ మాత్రం ప‌ట్టులేదు.. అక్కడ రాజ‌కీయం చేయ‌డం ఇష్టంగా కూడా లేదు. రామ‌చంద్రాపురంలో బోస్‌, వేణు వ‌ర్గాలు ఏ మాత్రం సందు ఇవ్వడం లేదు. దీంతో మండ‌పేట ఇన్‌చార్జ్‌గా ఉంటూ రామ‌చంద్రాపురంలో త‌న వ‌ర్గాన్ని కాపాడుకోవ‌డం ఆయ‌న‌కు త‌ల‌కు మించిన భారంగా మారింది. పైగా అధిష్టానం నుంచి రామ‌చంద్రాపురం వ్యవ‌హారాల్లో వేలు పెట్టవ‌ద్దని ఆదేశాలు కూడా వ‌చ్చేశాయి. దీంతో త్రిమూర్తులు కూడా వైసీపీలో సెగ‌ల మ‌ధ్యే రాజ‌కీయం చేసుకోవ‌డం త‌ప్పా చేసేదేం లేదు. వ‌చ్చే ఎన్నిక‌లకు అయినా ఆయ‌న‌కు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో ? తెలినీ ప‌రిస్ధితి. ఏదేమైనా రెండు తోట ఫ్యామిలీలు ఎన్నో ఆశ‌ల‌తో జ‌గ‌న్ చెంత చేరినా అక్కడ ఎదురీదుతోన్న ప‌రిస్థితి.

Related Posts