రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలి
కరీంనగర్ ఫిబ్రవరి 19,
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం, చిగురుమామిడి గ్రామాల్లో, సైదాపూర్ మండలం లోని దుద్దెనపల్లి, రాయికల్ గ్రామాల్లో రైతు వేదికలను మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే సతీష్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. మంత్రి ఈటల మాట్లాడుతూ రైతులు అభివృద్ధి చెందినప్పుడే అన్ని వ్యాపార వ్యవహారాలు అభివృద్ధి చెందుతాయని, దేశానికి వెన్నేముక, త్యాగశీలి రైతు అని కొనియాడారు.
135 కోట్ల జనాభా కలిగిన భారత దేశంలో ఇప్పటికీ 70 శాతం మంది ప్రజలు గ్రామాల్లో నివసిస్తూ, భుమితల్లి, వ్యవసాయం పై ఆధారపడి జీవిస్తున్నారని గుర్తు చేశారు. మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గ ప్రాంతానికి త్వరలో గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టు ద్వారా సాగునీటి సౌకర్యం కల్పిస్తామని, దీంతో రైతులు సంవత్సరానికి రెండు పంటలు పండించి అభివృద్ధి చెందుతారన్నారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం ఈసారి దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో కలిపి 1 కోటి 5 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తే, అందులో 62 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని సమకూర్చిన ఘనత తెలంగాణ రాష్ట్రానిదే అన్నారు. నేడు దేశంలో కరువు వస్తే అన్నం పెట్టే సత్తా తెలంగాణ రాష్ట్రానికి ఉందన్నారు. రైతు వేదికలను రైతులు సద్వినియోగం చేసుకొని తక్కువ సాగుబడి ఖర్చులతో ఎక్కువ లాభాలను ఆర్జించే పంటలను పండించాలని కోరారు.
=======================