తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు ఆడపిల్లల సంరక్షణ కు పాటుపడుతుందని, కుటుంబ సలహా కేంద్రాలను పెంచేలా చూడాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్ కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నీలం భరద్వాజ ను కోరారు.. ఈ .మేరకు ఢిల్లీకి వెళ్లిన రాగం సుజాత యాదవ్ కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు కార్యాలయంలో ఈడీని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళల అభివృద్ధికి, ఆడ పిల్లల సంరక్షణకు సాంఘిక సంక్షేమ బోర్డు చేపట్టే కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని రాగం సుజాత యాదవ్ చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఉన్న 39 కుటుంబ సలహా కేంద్రాలు ఉన్నాయని, అదనంగా మరిన్ని కుటుంబ సలహా కేంద్రాలను, అవర్నెస్ ప్రోగ్రాంలు, మొబైల్ క్రష్ సెంటర్లను ఏర్పాటు చేస్తే సాంఘిక సంక్షేమ బోర్డు మరింత ఉత్సాహంగా మహిళలకు చేదోడువాదోడుగా నిలుస్తుందన్నారు. ఇప్పుడున్న ప్రోగ్రామ్స్ నిర్వహణకు బడ్జెట్ ను పెంచాలని ఈడీ నీలం భరద్వాజ ను రాగం సుజాత యాదవ్ కోరారు. తమ వినతి మేరకు ఈడీ సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.