హోర్డింగ్ ఫ్రీ సిటీగా హైదరాబాద్
హైదరాబాద్, ఫిబ్రవరి 24,
గ్రేటర్లో హోర్డింగ్ల నియంత్రణకు జీహెచ్ఎంసీ పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. నగర అందాలకు విఘాతం కలిగిస్తూ ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్న హోర్డింగ్స్లను నియంత్రించడంతో పాటు అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘిస్తున్న యాడ్ ఏజెన్సీలపై ఉక్కుపాదం మోపుతున్నది. ఇందులో భాగంగానే ఇప్పటికే సరళీకృతమైన అడ్వైర్టెజ్మెంట్ పాలసీ తీసుకువచ్చి పకడ్బందీగా అమలు చేస్తున్నది. జీవో 68ప్రకారం 15మీటర్ల కంటే ఎత్తు ఉన్న హోర్డింగ్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించడం లేదు. ఫ్లెక్సీలు, హోర్డింగ్స్లో నిబంధనలను ఉల్లంఘిస్తున్న యాడ్ ఏజెన్సీలకు భారీ జరిమానా, క్రిమినల్ చర్యలతో ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) చర్యలు చేపడుతున్నది. గతంలో లెక్కాపత్రం లేని హోర్డింగ్ల నుంచి హోర్డింగ్స్ ఫ్రీ సిటీగా మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతుండటం గమనార్హం. నగరంలో ఏర్పాటు చేసే హోర్డింగ్స్ ప్రజలకు ఎలాంటి ప్రమాదం కలిగించకుండా ఉండేందుకు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. వ్యాపార ప్రకటనతో పాటు హోర్డింగ్ సామర్థ్యం పరీక్షించి సర్టిఫికెట్ను జారీ చేస్తున్నారు. ప్రజల భద్రత కోసం ప్రతి ఆరు నెలలకు ఒకసారి తనిఖీ చేస్తూ.. జరిమానా వేయడమే మా ఉద్దేశం కాదని, నగరాన్ని అందంగా ఉంచడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొంటున్నారు. కాగా జరిమానాల రూపంలో దాదాపు రూ.50 నుంచి 60కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవడం గమనార్హం.భూమి నుంచి 15అడుగుల ఎత్తులో వ్యాపార ప్రకటనను అనుమతి లేకుండా ఏర్పాటు చేస్తే రూ. రూ.లక్ష జరిమానాభూమి నుంచి 15 అడుగుల ఎత్తు కంటే తక్కువ ఎత్తులో వ్యాపార ప్రకటనను అనుమతి లేకుండా ఏర్పాటు చేస్తే రూ. 50 వేలు జరిమానవ్యాపార ప్రకటనలో ప్లాషింగ్ లైట్లను వాడినా, నాన్ స్టాటిక్ లైట్లను అనుమతి లేకుండా వినియోగిస్తే రూ.50 వేలు జరిమానాభవనం ముఖ భాగంలో 15శాతం కంటే ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపార ప్రకటనను ఏర్పాటు చేస్తే ప్రతి వంద చదరపు అడుగులకు, రోజుకు రూ.100 చొప్పున జరిమానా.కదిలే, తిరిగే వ్యాపార ప్రకటనల బోర్డులు ఏర్పాటు చేస్తే రూ.10 వేలు.. స్ట్రక్చురల్ స్టబిలిటీ సర్టిఫికెట్ లేకుండా వ్యాపార ప్రకటనను ఏర్పాటు చేసినా రోజుకు రూ.50వేలు
రోడ్లమీద కదులుతున్న వాహనాలపై వ్యాపార ప్రకటనలను నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తే రూ. 10వేలువ్యాపార ప్రకటనలకు ఏర్పాటు చేసిన లైటింగ్ అనుమతించిన దానికంటేఎక్కువగా ఉన్నట్లయితే రూ.10వేలు
పర్యావరణపరిరక్షణపై ప్రత్యేక నజర్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా వ్యాపార ప్రకటనల కోసం ఏర్పాటు చేసే లైట్లు రాత్రి 7 గంటల నుంచి ఉదయం 4 గంటలకు ఉండాలి. నాన్ ఎల్ఈడీ బల్బులు ఉంటే అడ్వైర్టెజ్మెంట్ ఫీజులో 20 శాతం అదనంగా చెల్లించాలి. అడ్వైర్టెజ్మెంట్ హోర్డింగ్ల ఏర్పాటులో బయోడిగ్రేటబుల్ వాడకాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నారు.వ్యాపార ప్రకటన బోర్డులను చారిత్రాత్మక కట్టడాలపైన, ప్రహరీగోడ లోపల ఏర్పాటు చేయడానికి అనుమతిలేదు. అదేవిధంగా జలవనరులు, నది తీరాల్లో, నాలాలు, శిఖం భూముల్లో, బ్రిడ్జిలు, రైల్వే క్రాసింగ్స్ వద్ద ఏర్పాటు చేయడానికి అనుమతించరు.భవనాలకు సహజ సిద్ధంగా వచ్చే వెలుతురును అడ్డుకునేలా ఏర్పాటు చేసే సైన్ బోర్డులకు, వ్యాపార ప్రకటనల హోర్డింగ్లకు అనుమతివ్వరు.కదిలే వాహనాలపై వ్యాపార ప్రకటనల ఏర్పాటులో పలు నిబంధనలు పాటించాలి. ముఖ్యంగా కదిలే వాహనంపై కేవలం ప్రత్యేకంగా ఒక బోర్డును ఏర్పాటు చేసి దానిపై వ్యాపార ప్రకటన ఉండాలే తప్పా, మిగతా ప్రాంతాల్లో ఎక్కడ ఉండకూడదు.విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉన్న ప్రాంతంలో వ్యాపార ప్రకటనల బోర్డులు ఏర్పాటు చేయడానికి అనుమతి లేదు.మెట్రో రైల్ సేవలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వ్యాపార ప్రకటనలు ఏర్పాటు చేయడానికి అనుమతిలేదు. ప్రమాదకరంగా ఉంటుందో లేదో పరీక్షించిన తర్వాతే ఆయా ప్రాంతాల్లో అనుమతిస్తారు.భవనం రూఫ్ టాప్పైన వ్యాపార ప్రకటనల బోర్డులను ఏర్పాటు చేయడానికి అనుమతించరు.ప్రభుత్వం, కమిషనర్లు ఏవైనా ఇతర ప్రాంతాల్లో వ్యాపార ప్రకటనల బోర్డులను ఏర్పాటు చేయరాదని నిర్ణయిస్తే, అక్కడ అనుమతించరు.