ఉన్నావ్, కథువా ఘటనలతో దేశం అట్టుడికిన నేపథ్యంలో బాలికలపై అత్యాచారలకు పాల్పడితే ఉరిశిక్ష విధిస్తామంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం అత్యవసర ఆదేశం తెచ్చిన తర్వాత కూడా నోయిడాలో ఘోర సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఎన్ని కఠిన చట్టాలు చేసినా దేశంలో మహిళలపై అత్యాచారాలు ఆగడంలేదు. కారులో లిఫ్ట్ ఇస్తామంటూ తన తోటి స్నేహితులే 17 ఏళ్ల బాలికపై దాష్టీకానికి పాల్పడ్డారు. కదులుతున్న కారులోనే ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ నెల 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రేటర్ నోయిడాకు చెందిన 17 ఏళ్ల బాలిక పాఠశాల నుంచి ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా తన తోటి స్నేహితులు కారులో ఇంటివద్ద దింపుతామని నమ్మించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరు ఆమెకు దూరపు బంధువు, మరొకరు పాఠశాలలో తోటి విద్యార్థి కాగా మరో వ్యక్తి అపరిచితుడు. అయితే, రోజూ మధ్యాహ్నానికే ఇంటికి రావాల్సిన తమ కుమార్తె ఆ రోజు సాయంత్రమైనా రాకపోవడంతో తల్లిద్రండులు ఆందోళనకు గురయ్యారు. అదే రోజు రాత్రి పోలీసులను ఆశ్రయించారు. కస్నాలో ఉండే పాఠశాలకు రోజూ బస్సులో వెళ్లే తమ కుమార్తె మధ్యాహ్నం 3గంటలకే ఇంటికి చేరుకొనేదని, రాత్రయినా రాలేదని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నాలెడ్జ్ పార్క్ ప్రాంతంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో అర్ధరాత్రి బాలికను గుర్తించారు. పాఠశాల బస్సు తప్పిపోవడంతో తాను ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా ముగ్గరు వ్యక్తులు వచ్చి తనను ఇంటి వద్ద దింపుతామని నమ్మించారని, కారులోకి ఎక్కాక వారు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన అనంతరం బాలికను రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయారని వివరించారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.