వామపక్షాలపై భాజపా నేతలు దిగజారుడు ప్రచారం చేస్తున్నారని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. డెబ్బై ఏళ్ల దేశ చరిత్రలో కమ్యూనిస్టు ముఖ్యమంత్రులు, మంత్రులు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారా? అని ప్రశ్నించారు.మంగళవారం ఇక్కడ మీడియా సమావేశం లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన అవినీతిలో కమ్యూనిస్టులకు కూడా వాటా ఉందని భాజపా అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. యూపీఏ ప్రభుత్వానికి బయట నుంచి మాత్రమే మద్దతిచ్చామని గుర్తుచేశారు. దేశంలో మోదీ ప్రభుత్వం అవినీతిపరులను కాపాడుతోందని... వారికి వంత పాడుతోందని దుయ్యబట్టారు.అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్లొచ్చిన వ్యక్తిని కర్ణాటకలో భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిందని రామకృష్ణ ఎద్దేవా చేశారు. చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరు కలిసి ‘భరత్ అను నేను’ సినిమా చూడాలని హితవు పలికారు. ఏపీలో చంద్రబాబు ప్రజలను మోసం చేస్తూ పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఈ రోజు రాత్రి 7 గంటలకు కరెంట్ బంద్ చేసి ప్రజలందరూ అరగంట పాటు నిరసన తెలపాలని ఆయన పిలుపునిచ్చారు.