బాన్సువాడలో డబుల్ బెడ్ రూమ్స్
నిజామాబాద్, మార్చి 1,
స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి సొంత నియోజకవర్గం బాన్సువాడలో 8 మండలాలు ఉన్నాయి. ఇప్పటివరకు నియోజకవర్గానికి 4,950 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయి. ఇందులో 2,898 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. 2052 ఇండ్లు వేగంగా నిర్మాణాలు పూర్తి చేసుకుంటున్నాయి. 2,716 ఇండ్లను లబ్ధిదారులకు అందజేశారు. శరవేగంగా నిర్మాణాలతో బాన్సువాడ రాష్ట్రంలోనే 4వ స్థానంలో నిలిచి.. డబుల్ బెడ్రూం ఇండ్లకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నది. తాడ్కోల్ శివారులో జీప్లస్- 2 పద్ధతిలో నిర్మించిన డబుల్ ఇండ్ల సముదాయం ఓ ప్రత్యేక పట్టణంగా దర్శనమిస్తున్నది. కిరాయి ఇంట్ల ఉన్న తమకు సర్కారు డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చిందని, ఆ ఇంట్లోనే సంతోషంగా ఉంటున్నామని బీర్కూర్కు చెందిన గుండూరు విజయాగౌడ్ తెలిపారు. ఇండ్లు ఎంత మంచిగున్నయో బీజేపోళ్లు బీర్కూర్కు వస్తే తెలుస్తుందని చెప్పారు. ‘నా భర్త 37 ఏండ్లు బీర్కూర్ సర్పంచ్గా పనిచేశారు. నా ఇల్లు కూలిపోతే.. మా పరిస్థితిని గమనించి డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పించారు’ అని బీర్కూర్లో డబుల్ బెడ్రూం ఇంటి లబ్ధిదారు ధనమ్మ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై తప్పుడు ప్రకటనలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి నవ్వులపాలయ్యారు. ప్రజల ముందు తలదించుకున్నారు. పిల్లాపాపలతో తాము డబుల్ బెడ్రూం ఇండ్లలోనే నివసిస్తుంటే.. అసలు ఇండ్లే ఇవ్వలేదని బీజేపీ నేతలు అనడంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. బీజేపీ తాడ్కోల్లో నిర్వహించిన సభలో బండి ప్రసంగించిన వేదికకు కూతవేటు దూరంలోనే వేల డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకోవడం విశేషం. కండ్ల ముందు ‘డబుల్' రాజసం ఉట్టిపడుతుంటే.. బండి నోటికొచ్చినట్టు అబద్ధాలు మాట్లాడటంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తంచేశారు.