అవినీతిపై పోరుకు మానసిక దారుఢ్యంతో పాటు శారీరక దారుఢ్యం అవసరం మల్లయోధుల సన్మాన సమావేశంలో పవన్ కళ్యాణ్
గురు పరంపరతో అభ్యసించే యుద్ధ విద్యలు మన దేశానికి చాలా అవసరమని, దేశీయ యుద్ధ విద్యలైన కుస్తీ, కర్రసాము వంటివాటిని ప్రోత్సహించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. అవినీతిపై పోరాటం చేయాలంటే మానసిక దారుఢ్యంతో పాటు శారీరక దారుఢ్యం చాలా అవసరమన్నారు. మానసికంగా, శారీరకంగా బలంగా లేకపోతే రౌడీలు, అవినీతిపరులు రాజ్యమేలుతారని హెచ్చరించారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ లో ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర నుంచి వచ్చిన 16 మంది మల్లయోధుల బృందాన్ని సత్కరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... “ప్రాచీన యుద్ధ విద్యలకు మన దేశం పేరెన్నికగన్నది. అయితే కొన్ని దశాబ్దాలుగా ఆదరణకు నోచుకోక అంతరించిపోయే దుస్థితి నెలకొంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ యుద్ధ విద్య సంస్కృతి బతికే ఉంది. చిన్నప్పుడు చీరాలలో ఉన్నప్పుడు మా నాన్నగారు కుస్తీ పోటీలకు తీసుకెళ్లేవారు. స్థానికంగా ఉండే పహిల్వాన్ అప్పారావు లాంటి యోధుల యుద్ధ విద్యలను దగ్గరుండి చూసేవాడిని. నేర్పుకోవాలనే తపన ఉండేది కానీ శరీరం సహకరించేది కాదు. కోడి రామ్మూర్తి నాయుడు లా దేహ దారుఢ్యం సంపాదించాలనే కోరిక ఉండేది కానీ తీరలేదు. కొన్నేళ్ల తర్వాత మార్షల్ ఆర్ట్స్ లోకి వెళ్లి కొంత సాధన అయితే చేశాను. కిక్ బాక్సింగ్, కరాటే, ఇండోనేషియా మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యం పొందానని అన్నారు.