చిత్తూరు
చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లిన తెదేపా అధినేత చంద్రబాబును రేణిగుంట విమానాశ్రయంలోనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విమానాశ్రయంలోనే బైఠాయించి ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు చర్యలతో తన సంకల్పాన్ని అడ్డుకోలేరని చంద్రబాబు స్పష్టం చేశారు. తనను ఎవరూ అడ్డుకోలేరని.. తమ గొంతు నొక్కలేరని ట్విటర్ వేదికగా ఆయన జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజలను కలవనీయకుండా అడ్డుకోవడం తగదని ముఖ్యమంత్రికి హితవు పలికారు. భయపెట్టి ఎన్ని రోజులు పాలన సాగిస్తారని ప్రశ్నించారు. జగన్ ఇంకా రాజకీయ పరిణితి సాధించాలని విమర్శించారు. పోలీసుల చర్యలతో చంద్రబాబును అడ్డుకోలేరని అటు తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబును అడ్డుకోవటాన్ని పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. సీనియర్ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర, కాలవ శ్రీనివాసులు, గద్దె రామ్మోహన్, అమర్నాథ్ రెడ్డి, బండారు సత్యనారాయణ మూర్తి, బీటీ నాయుడు, జవహర్, పీతల సుజాత తదితరులు ట్విట్టర్ ద్వారా చంద్రబాబు అరెస్టుపై ధ్వజమెత్తారు. రాజారెడ్డి రాజ్యాంగానికి తాజా పరిణామాలు పరాకాష్ఠ అని ఆక్షేపించారు. వైకాపా నాయకుల రికార్డింగ్ డ్యాన్సులకు అడ్డురాని కరోనా చంద్రబాబు పర్యటనకు ఎలా అడ్డొచ్చిందని నిలదీశారు. తుగ్లక్ పాలనపై ప్రజలు తిరగబడతారనే విమానాశ్రయంలో తమ అధినేతను నిర్బంధించారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓటమి భయం జగన్ను ఇంకా వెంటాడుతోందని ధ్వజమెత్తారు