కశ్మీర్ నేత గులాం నబీ ఆజాద్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ వర్కర్లు దగ్ధం చేశారు. జమ్మూలో ఆజాద్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటీవలే రాజ్యసభ నుంచి గులాం నబీ ఆజాద్ రిటైర్ అయిన విషయం తెలిసిందే. అయితే ప్రధాని మోదీపై ఈ సందర్భంగా గులాం నబీ ఆజాద్ ప్రశంసలు కురిపించారు. కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి నేతలంతా కశ్మీర్లో ఈమధ్యే గులాం నబీ ఆజాద్కు సన్మానం చేశారు. అయితే ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థాయి పదవిలో ఉన్న ఆజాద్ ఇప్పుడు ఆ పార్టీకి మద్దతు ఇవ్వకపోవడం పట్ల నిరసన వ్యక్తం అవుతున్నది. గులాం నబీ ఆజాద్ తీరును ఖండిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు ఇవాళ జమ్మూలో ర్యాలీ తీశారు. బీజేపీతో ఆజాద్ దోస్తీ కట్టినట్లు ఆరోపించారు. డీడీసీ ఎన్నికల ప్రచారం సమయంలో కశ్మీర్కు ఆజాద్ రాలేదని, ఇప్పుడు మాత్రం ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపిస్తున్నారని కాంగ్రెస్ వర్కర్లు ఆరోపించారు. గులాం నబీ ఆజాద్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కశ్మీరీలు దిష్టిబొమ్మను దహనం చేశారు.