కర్నూలు
ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం కలిసి ఉన్న మహా పుణ్యక్షేత్రం శ్రీశైలం. భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో గురువారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి.
ఉదయం 9.45 గంటలకు స్వామివారి అర్చకులు యాగశాల ప్రవేశం చేసి శాస్త్రోక్తంగా ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. శివ సంకల్పం, గణపతిపూజ, చండీశ్వర పూజ, కంకణపూజ, దీక్షా కంకణధారణ, రుత్విగ్వరుణం తదితర పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికే ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుద్దీపాలంకరణలతో ముస్తాబు చేశారు. మరోవైపు తెల్లవారుజామునుంచి ఆలయానికి భక్తుల తాకిడి మొదలైంది. శివనామస్మరణతో భక్తులు శ్రీగిరుల వెంట పాదయాత్రగా తరలి వస్తున్నారు. 11న మహాశివరాత్రి పర్వదినం రోజున తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భారీగా భక్తులు తరలి వస్తారని, ఈ ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈఓ తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ దర్శన వేళల్లో మార్పులు, ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు ప్రకటించారు. శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా కాలినడకన వచ్చే భక్తులను గుర్తించి వారికి ప్రత్యేక కంకణాలను ఇస్తున్నట్లు చెప్పారు. అడుగడుగున ఈ టాయిలెట్స్, మంచినీరు, అన్నప్రసాదాలు, వైద్య సేవలతో పాటు అంబులెన్సులను ఏర్పాటు చేసారు.