ఎండలు భయపెడుతున్నాయి. హీట్ వేవ్.. చికాకుపెడుతుంది. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఎండలకు పొల్యుషన్ తోడైతే.. బతుకు నరకంగా మారుతుంది. కాంక్రీట్ జంగిల్ లా మారిన సిటీలో... కూలర్లు, ఏసీల్లేందే ఎండల్ని తట్టుకోవడం కష్టం. ఇక బయటకెళ్లాలంటే.. ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా 35 నుంచి 36 డిగ్రీల ఉష్ణోగ్రతను బమాత్రమే మన బాడీ తట్టుకోగలదు. ప్రస్తుతం టెంపరేచర్ 40 డిగ్రీలు దాటుతోంది. ఇలాంటి సమయాల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి. డిగ్రీల ఉష్ణో్గ్రత దాటితో శరీరంలో వేడిని తట్టుకోవడానికి గుండె, రక్తనాళాలు, స్వేదగ్రంథులు, సాధారణం కంటే ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. శరీర ఉష్ణోగ్రత తీవ్రంగా పెరగడం, తీవ్రమైన తలనొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, నాలుక తడారి పోతుండటం, శరీరంలో నీటి శాతం బాగా తగ్గిపోవడం పాక్షికంగా లేదా పూర్తిగా అపస్మారక స్థితికి చేరడం వంటివి వడదెబ్బ లక్షణాలు. చెమట వల్ల శరీరం ఉప్పుశాతాన్ని కోల్పోయి తలనొప్పి, కళ్లు తిరగడం, వికారం వాంతులు వంటివి సంభవిస్తాయి. కొంతమందిలో ఒంటినొప్పులు, తిమ్మిర్లు కూడా వస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. పెరుగుతున్న ఎండలతో బ్యాక్టీరియా, వైరస్ లాంటివి విజృంభించే ప్రమాదముంది. వాతావరణ మార్పులతో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగితే 17 శాతం ఇన్ ఫెక్షన్లు పెరుగుతాయని ఈ మధ్యే ఓ రీసెర్చ్ బయటపెట్టింది. అంటే ఈ వేసవి ఇన్ఫెక్షన్లను మోసుకొస్తుందన్న మాట. మామూలుగా సమ్మర్ లో డీ హైడ్రేషన్ తో బాధపడుతుంటారంతా. అలాగే స్కిన్ అలర్జీస్, కళ్లమంటలు లాంటివి కామన్ గా వచ్చే సమస్యలు. కొద్దిపాటి జాగ్రత్తలతో వీటిని అధిగమించొచ్చు. నీళ్లతో పాటు పళ్ల రసాలు, నిమ్మరసం, వాటర్ మిలన్స్, కీరా లాంటివి తింటూ వేడిని తగ్గించుకోవచ్చు. ఇక చిన్నపిల్లలు-వృద్ధులకైతే ఓఆర్ఎస్ పౌడర్ కలిపిన నీళ్లు, నిమ్మరసం తాగిస్తే బెటర్. డీ హైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తే ఎలక్ట్రోలైట్స్ లభించే పానియాలు, పళ్లు తీసుకుంటే వెంటనే రిలీఫ్ అవుతుంది. బయటకెళ్లాల్సి వస్తే తేలికపాటి కాటన్ దుస్తులు ధరించి.. గొడుగు తీస్కెళ్తే బెటర్. ఇక వేసవిలో మామూలుగా గుండెపోటు సమస్య ఎక్కువుంటుందట. ఎండ వేడిమితో హైపర్ థెర్మియా వచ్చే అవకాశాలుంటాయి. మనిషి శరీరం మామూలుగా స్వీకరించే వేడికన్నా ఎక్కువ వేడి తీస్కోవాల్సి రావడమే హైపర్ థెర్మియాకు కారణం. ఒకరకంగా వడదెబ్బలాంటిదే. ఆ పరిస్థితి రాకుండా ముందే ఇంట్లోకి ఎక్కువ వేడి రాకుండా చూసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఎండాకాలం పిల్లలు-వృద్ధుల్లో సమస్యలు చాలా ఎక్కువ. వాళ్ల విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటున్నారు నిపుణులు. ఎండలు పెరుగేకొద్ది చిన్నపిల్లల్లో జ్వరం, అతిసారం, చర్మవ్యాధుల లాంటి సమస్యలొస్తాయి. పిల్లల్ని ఎండలో తిరగనీయకుండా చూడాలి. ముఖ్యంగా ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువ. ఆ టైంలో బయటకు వెళ్లనీయకపోవడం మంచిదంటారు డాక్టర్లు. ఇక ఎప్పటికప్పుడు పండ్లు, పానీయాలు ఇస్తూ ఉండాలి. ఇక తప్పనిసరైతే తప్ప పెద్దవాళ్లైనా బయటకు వెళ్లకపోవడం మంచిది. ఎండలు పెరుగేకొద్ది వడదెబ్బ తీవ్రత పెరిగే అవకాశముంటుంది. తీవ్రమైన తలనొప్పి, నీరసంగా ఉండడం, చర్మం పొడిబారడం, సొమ్మసిల్లడం లాంటివి వడదెబ్బ లక్షణాలు. నీరు తక్కువగా తీసుకోవడం, మత్తుపానీయాలు సేవించడం, ఎండలో తిరగడం, విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఉంది.
ఇక సమ్మర్ సీజన్ లో బయటి ఫుడ్ తినకపోవడం మంచిదంటున్నారు వైద్యులు. వేసవిలో సాధారణంగా మిగతా కాలాల్లో తాగే నీళ్ల కన్నా రెండింతలు ఎక్కువే తాగాలి. అయితే నీళ్లు ఎక్కువగా తాగడం కూడా అంత మంచిది కాదు. శరీరం కోల్పోయే లవణాల్ని ఫిల్ చేసేలా ఎలక్ట్రోలైట్స్ కలిపిన ద్రావణాల్ని తాగాలి. ఓఆర్ఎస్ పౌడర్, నిమ్మరసం లాంటివన్నమాట. అలాగే కీరదోస, క్యారట్, బీట్రూట్ లాంటి పచ్చికూరగాయలు తింటే మంచిదంటారు వైద్యులు. ఎండను ఫేస్ చేయడం తప్ప మనకు వేరే మార్గం లేదు. అయితే మూడు నెలల పాటు ప్రతీరోజూ కీలకమే. ఈ వేసవిలో ప్రయాణాలు పెట్టుకోకపోవడమే బెటర్. సాధ్యమైనంతవరకు ఇళ్లు కదలకుండా... నీడలో గడిపితేనే బెటర్.