జనసేన పార్టీ కార్యాలయం మారనుంది. ఇనార్బిట్మాల్ దగ్గర జనసేన నూతన కార్యాలయాన్ని తీసుకున్నట్లు పార్టీ పెద్దలు ఓ ప్రకటనలో తెలిపారు. ఇదివరకు జూబ్లిహిల్స్ రోడ్ నంబర్: 72 ప్రశాసన్ నగర్లో పార్టీ ఆఫీస్ ఉండేది. అయితే అక్కడ భవనం ఇరుకుగా, అభిమానులు ఎక్కువగా వస్తే కలిసి మాట్లాడేందుకు కాస్త ఇబ్బందులు తలెత్తడంతో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పార్టీ ఆఫీస్ మార్చేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఇనార్బిట్కు దగ్గర్లో మూడంతస్తుల భవనాన్ని పవన్ కల్యాణ్ లీజుకు తీసుకున్నారు. ఈ భవనంలో మహిళ, యువత, మీడియా మొదలగు విభాగాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రెండు మూడ్రోజుల్లోనే ఆఫీస్ షిప్టింగ్ చేయనున్నట్లు సమాచారం. ఆఫీస్ ప్రారంభం రోజున పెద్దఎత్తున అభిమానులను, ప్రముఖులను ఆహ్వానించాలని పవన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆఫీస్ మార్చిన అనంతరం అన్ని వివరాలు గూగుల్లో పొందుపరచనున్నారు. ఇక మీదట పవన్ను కలవడానికి అభిమానులు, కార్యకర్తలు, నేతలు జూబ్లిహిల్స్కు వెళ్లాల్సిన అవసరం లేదన్న మాట. ఇదిలా ఉంటే గుంటూరులో రెండు ఎకరాల్లో కొత్త ఇంటిని నిర్మిస్తున్న పవన్ అందులోనే పార్టీ కార్యాలయాన్ని సైతం పెట్టుకోవాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదివరకు కార్యాలయానికి గాను భూమి లీజుకు తీసుకోగా అదికాస్త వివాదానికి తలెత్తడంతో జనసేన వదులుకోవడం జరిగింది.