పాలమూరు, మార్చి 16,
అసల్ సమయానికి ఫసల్ గయా అన్నట్టుంది ఆయన వ్యవహారం. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ముందుడి ప్రచారం చేయాల్సిన ఆయన కనిపించడమే గగరనమైంది. దీంతో ఆయన పార్టీ లోనే వున్నారా లేదా అనే అనుమానాలు వస్తున్నాయి. అంతేకాదు.. వేరే కండువా కప్పుకోబోతున్నారా అనే టాక్ కూడా నడుస్తోంది. నువ్వా నేనా అన్నట్టు సాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల వేళ, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముఖం చాటేయడం పాలమూరు కమల దళంలో ఆసక్తికరంగా మారింది. జిల్లా కేంద్రంలోతో పాటు, ఇతర ప్రాంతాల్లో జరిగిన ప్రచార సభలకు కూడా ఆయన గైర్హాజరు కావటం పార్టీలో చర్చగా మారింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపి ధర్మ పురి అరవింద్ సభల్లో పాల్గొంటున్నా ఎర్ర శేఖర్ మాత్రం అడ్రస్ లేరు. దీంతో ఎర్ర శేఖర్ బిజెపికి గుడ్ బై చెప్పినట్లేనా అనే చర్చ స్థానికంగా సాగుతోంది. అనుచరవర్గంతో పాటు, పార్టీ నేతలకూ ఫోన్ లో కూడా ఎర్ర శేఖర్ అందుబాటులో లేరని తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ...నారాయణ పేట పర్యటన చేపట్టిన క్రమంలో పాలమూరు జిల్లాలోని కొందరు నేతల వ్యవహర శైలితో హర్ట్ అయిన ఎర్ర శేఖర్ వెంటనే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి, పార్టీ పెద్దల జోక్యంతో సాయంత్రానికి తన నిర్ణయంపై వెనక్కు తగ్గారు. ఆ తరువాత కూడా అంటీ ముట్టనట్టే వ్యవహరిస్తూ వస్తున్న ఎర్రశేఖర్ ఇప్పుడు మరీ అందుబాటులో లేకుండా పోయారట. ఇక కొనసాగలేనని పార్టీ పెద్దలకు సమాచారం ఇచ్చినట్లు వార్తలొస్తున్నప్పటికి , ఎర్ర శేఖర్ నుంచి ఎలాంటి ప్రకటనలు , రాజీనామా లేఖలు మాత్రం రాలేదు. టిడిపి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతూ పార్లమెంట్ ఎన్నికల వేళ బిజెపిలో చేరిన ఎర్ర శేఖర్, కమల దళంలో జాతీయ నేతల ఆశీస్సులతో బిజెపి జిల్లా అధ్యక్ష పదవి దక్కించుకున్నారు. అయితే జిల్లా అధ్యక్షుడిగా బాద్యతలు చేపట్టినప్పటినుంచి పాత నేతల్లోని ఓ వర్గం నుంచి సహాయ నిరాకరణ జరుగుతుందనేది లోకల్ బిజెపిలో వినిపిస్తున్న టాక్. పాత, కొత్త నేతలకు అసలే పొసగడం లేనట్లు తెలుస్తోంది. ఇతర పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్న ఎర్ర శేఖర్ బిజెపిలో, అది కూడా జిల్లా అధ్యక్ష పదవిలో ఇమడలేక పోతున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కమలం నేతలు. కొత్త జిల్లా అధ్యక్షుడు ఎవరనే దానిపై కూడా పార్టీలో ఓ నిర్ణయం కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పేరుకు జిల్లా అధ్యక్షుడనే తప్ప.., మెుదటి నుంచి ఆయనపట్ల రాష్ట్ర నాయకత్వం, ఇతర సీనియర్ నేతలు వివక్ష ప్రదర్శిస్తున్నారన్న వాదన ఆయన అనుచర వర్గంలో ఉంది. క్రమంలో ఎర్ర శేఖర్ అడుగులు ఎటు పడతాయనే దానిపై అనేక ప్రచారాలు వినిపిస్తున్నాయి. ఎర్ర శేఖర్ కాంగ్రేస్ లో చేరుతాడు , టిఆర్ఎస్ లో చేరుతాడనే ప్రచారం ఊపందుకుంది. గతంలో రేవంత్ రెడ్డి తో ఉన్న సత్సంబంధాలతో కాంగ్రెస్ లో చేరేందుకు శేఖర్ సుముఖతతో ఉన్నారనే ప్రచారం జరుగుతుంటే, అదే సమయంలో టిఆర్ఎస్ లో చేరతారని రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి కూడా ఖాయమనే ప్రచారం స్థానికంగా జరుగుతోంది. మొత్తం మీద పాలమూరు బిజెపిలో నెలకొన్న పరిస్థితికి ముగింపేమిటనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.