న్యూఢిల్లీ మార్చ్ 16
రాజ్యసభ ఎంపీ స్వపన్ దాస్గుప్తా ఇవాళ తన పదవికి రాజీనామా చేశారు. 2016లో రాజ్యసభకు.. రాష్ట్రపతి కోటాలో నామినేట్ అయ్యారు. ఏప్రిల్ 2022 వరకు ఆయన రాజ్యసభలో కొనసాగాల్సి ఉంది. కానీ తాజాగా జరగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో.. స్వపన్ దాస్గుప్తా బీజేపీ తరపున పోటీ చేయనున్నారు. అయితే రాజ్యసభకు రాజీనామా చేయకుండా.. ఏ పార్టీలో చేరకుండా.. ఎలా పోటీ చేస్తారని తృణమూల్ ప్రశ్నించింది. పదవ షెడ్యూల్ ప్రకారం స్వపన్ దాస్గుప్తాను రాజ్యసభకు అనర్హుడిగా ప్రకటించాలని తృణమూల్ పార్టీ నేత మహువా మొయిత్రి తన ట్వీట్లో కోరారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అంశాన్ని లేవనెత్తింది. ఆ పార్టీ చీఫ్ విప్ జయరామ్ రమేశ్.. రాజ్యసభ చైర్మన్కు రాసిన లేఖలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. హౌజ్కు రిజైన్ చేయకుండా.. ఏ పార్టీలో చేరకుండా ఎలా స్వపన్ కొనసాగుతారని జయరామ్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఇవాళ స్వపన్ దాస్గుప్తా.. స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. రాష్ట్రపతి నామినేట్ చేసిన వ్ళక్తిగా తనకు రాజ్యసభలో ప్రత్యేక హోదా ఉందని, తారకేశ్వర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాని, అన్ని సమస్యలు ముగిశాకే నామినేషన్ వేస్తానని, మరో రెండు రోజుల్లో నామినేషన్ వేయనున్నట్లు స్వపన్దాస్ ఓ మీడియాతో పేర్కొన్నారు.