మియాపూర్-అమీర్పేట-నాగోల్ 30 కి.మీ. దూరమైనా మెట్రో ప్రయాణించేది 27.6 కి.మీ. మాత్రమే. ఈ రెండు వేర్వేరు కారిడార్లలోని మెట్రో మార్గంలో ఈ నెల 21 నుంచి ఫ్రీక్వెన్సీ పెంచారు. ఏడెనిమిది నిమిషాలకు ఒక మెట్రో నడుపుతున్నా.. సగటున ఒక ప్రయాణికుడు ప్లాట్ఫాంపైకి వచ్చి రైలు కోసం ఎదురుచూస్తున్న సమయం మూడు నాలుగు నిమిషాలకు మించడం లేదు. ప్రయాణికులు వచ్చే సరికి ప్లాట్ఫాంపై మెట్రో లేదంటే.. నాలుగు నిమిషాల్లోనే మరో మెట్రో వస్తోంది. ఐదో నిమిషంలో మెట్రోలో ఉంటే.. ఆరో నిమిషంలో బయలుదేరి వెళుతోంది.రద్దీ సమయాల్లో ప్రతి 7 నిమిషాలకు, మిగతా సమయాల్లో 8 నిమిషాలకు ఒక రైలు నడుపుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు వరకు సర్వీసులు నడుస్తున్నాయి. చివరి రైలు డిపోకు చేరేసరికి 11 గంటలు దాటుతోంది. రెండు కారిడార్లలో కలిపి రానుపోను ఎల్ అండ్ టీ మెట్రోరైలు సంస్థ ప్రతిరోజు 520 ట్రిప్పులను నడుపుతోంది. సీబీటీసీ టెక్నాలజీ అనుమతి రావడంతో వేగం పెంచి మెట్రోరైళ్లను నడుపుతున్నారు. నాగోల్ నుంచి అమీర్పేట 16.7 కి.మీ. దూరానికి 33 నిమిషాలు పడుతోంది. నాగోల్ నుంచి బేగంపేట 15.2 కి.మీ.దూరం 28 నిమిషాల్లోనే వస్తోంది. రెండు నిమిషాల్లోనే ఒక స్టేషన్కు చేరుకొంటోంది. బేగంపేట నుంచి అమీర్పేట వరకు మాత్రం మలుపులు ఎక్కువగా ఉండటం, ట్రాక్ మారుతుండటంతో 1.5 కి.మీ. దూరానికే ఐదు నిమిషాల సమయం అవసరమవుతోంది. ఎస్ఆర్నగర్ నుంచి అమీర్పేట వరకూ ఇదే సమస్య ఉత్పన్నం అవుతోంది. కారిడార్లు మొత్తం అందుబాటులోకి వస్తే ఈ సమస్య ఉండదని మెట్రో వర్గాలు అంటున్నాయి.అమీర్పేట ఇంటర్ఛేంజ్ స్టేషన్ దాటి ముందుకు వెళ్లే వీలులేకపోవడంతో.. బేగంపేట స్టేషన్ తర్వాత గ్రీన్ల్యాండ్స్ దాటాక ట్రాక్ మారి అమీర్పేట ఫ్లాట్ఫాంపైకి వస్తోంది. ఇక్కడ ఒకటే ఫ్లాట్ఫాం వినియోగంలో ఉన్నందున.. ఒక మెట్రో వచ్చి వెళ్లాక మరొకటి వచ్చేలా జాగ్రత్తలు తీసుకునే క్రమంలో రెండు నిమిషాలు ఆలస్యం అవుతోంది.