నెల్లూరులోని కాపువీధిలో దివంగత టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి భౌతికకాయానికి పలువరు మంత్రులు నివాళులర్పించారు. వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జిల్లా ఇన్ చార్జి మంత్రి ఎన్.అమర్నాధ్ రెడ్డి, ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, స్థానిక నేతలు ఆనం కు నివాళులర్పించారు. మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ పక్కపక్కనే ఉండే అల్లీపురం, రాజుపాళెం వాసులైన సోమిరెడ్డి, ఆనం కుటుంబాల మధ్య 60 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. రాజకీయ పోరాటాలే తప్ప వ్యక్తిగతంగా రెండు కుటుంబాల సభ్యుల మధ్య ఆప్యాయత, అనుబంధాలు, ఆత్మీయతలు కొనసాగేవి. రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ప్రజల మధ్యలోనే ఉంటూ రాజకీయాలు చేసిన మాస్ లీడర్ వివేకానంద రెడ్డి అని కొనియాడారు. సంప్రదాయబద్ధంగా విలువలతో కూడిన రాజకీయాలు చేసిన కుటుంబం నుంచి వచ్చిన నేత. రాష్ట్రంలో వివేకా గారి పేరు తెలియని వారుండరని అన్నారు. సమస్యలపై గళం వినిపించడంలోనూ ఆయనది ప్రత్యేక శైలి. దురదృష్టవశాత్తు అనారోగ్యానికి గురై దివంగతులు కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. వివేకా గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరడంతో పాటు వారి కుటుంబసభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నానన్నారు.