ఖమ్మం, మార్చి 18,
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో డివిజన్ల విభజన పక్రియ ఎట్టకేలకు పూర్తయింది. ఇప్పటివరకు 50 డివిజన్లుగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ 60 డివిజన్లుగా రూపాంతరం చెందింది. ఈ మేరకు మున్సిపల్ అధికారులు సోమవారం ముసాయిదా విడుదల చేశారు. కొత్త డివిజన్ల ఏర్పాటుతో ప్రస్తుతం ఉన్న డివిజన్ల స్వరూపం పూర్తిగా మారినట్లయింది. గతంలో 50 డివిజన్లు ఉండగా 60 డివిజన్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈనెల 16 వ తేదీ వరకు వరకు ప్రజా ప్రతినిధులకు ప్రతిపాదిత ముసాయిదా పత్రాలను అందజేయనున్నారు. ఈ నెల 17 వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సాధారణ ప్రజల నుంచి ప్రతిపాదిత ముసాయిదాపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలను స్వీకరిస్తారు. దీని కోసం ఖమ్మం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఖమ్మం కార్పొరేషన్లోని 50 డివిజన్లలో మొత్తం ఓటర్లు 2,81,387 మంది ఉన్నారు. ఒక్కో డివిజన్లో 4,500 కనీసం ఓటర్లు ఉండే విధంగా అధికారులు 60 డివిజన్లను విభజించారు. ఒక్కో డివిజన్లో 3,500 ఓటర్ల నుంచి 5,500 వరకు విభజించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం డివిజన్ ప్రక్రియను ఆయా కార్పొరేషన్ పరిధిలోని ఉత్తరం నుంచి ప్రారంభించి తూర్పు, దక్షిణ, పడమర దిశలుగా పూర్తి చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం ఖమ్మం కార్పొరేషన్కు ఉత్తరం దిక్కు ఉన్న 1వ డివిజన్ కైకొండాయిగూడెం నుంచి డివిజన్ల ప్రక్రియ ప్రారంభమైంది.