షర్మిలకు అనూహ్యంగా మద్దతు
హైదరాబాద్, మార్చి 19,
తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా సాగుతున్న వైఎస్ షర్మిలకు రోజురోజుకూ అనూహ్యంగా మద్దతు పెరుగుతోంది. ఇండియన్ స్పోర్ట్స్ సూపర్ స్టార్స్గా ఎదిగిన హైదరాబాదీలు అజారుద్దీన్,సానియా మీర్జా కుటుంబ సభ్యులు షర్మిలతో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కుమారుడు మహ్మద్ అసదుద్దీన్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా దంపతులు వైఎస్ షర్మిలతో సమావేశమయ్యారు. లోటస్పాండ్లో ఆమెను కలసి ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. అజర్, సానియా కుటుంబ సభ్యులు షర్మిలను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మర్యాదపూర్వకంగానే షర్మిలతో భేటీ అయినట్లు ఆనం మీర్జ, అసదుద్దీన్ దంపతులు తెలిపారు.రాజన్న రాజ్యం తెస్తానని ప్రతినబూనిన వైఎస్ షర్మిల.. ఇప్పటికే జిల్లాల వారీగా నేతలతో సమావేశమవుతున్నారు. షర్మిల పెట్టబోతున్న పార్టీలో చేరేందుకు కొందరు టీవీ నటులు, సెలబ్రిటీలు ఆసక్తి చూపించారు. ఇటీవల ప్రజా కవి ఏపూరి సోమన్న ఆమెకు మద్దతు ప్రకటించారు. షర్మిలను కలసి మద్దతు కూడా తెలిపారు. ఇప్పుడు ఏకంగా అజారుద్దీన్ కుమారుడు అసదుద్దీన్, ఆనంమీర్జా దంపతులు కలవడంతో పార్టీలో చేరబోతున్నారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. షర్మిల టీంకి స్టార్ అప్పీయరెన్స్ కూడా తోడవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.