తుంగతుర్తి మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో మంచి నీటి ఎద్దడి నెలకొన్నా అటు గ్రామ పంచాయితీ వారు గానీ అటు సంబంధిత శాఖాధికారులు గానీ పట్టించుకోవడం లేదని 5వ వార్డు ప్రజానీకం ఆరోపిస్తున్నారు. తమ వార్డులో ఒకే వీధి నల్లాపై ముప్పై కుటుంబాలు మంచి నీటి కోసం ఆధార పడాల్సి వస్తోందని అంటున్నారు.ముప్పై కుటుంబాలకు నల్లా ద్వారా వచ్చే మంచి నీరు ఎలా సరిపోతుందని మహిళలలు ప్రశ్నిస్తున్నారు.ఒకపక్క మండుటెండలు ,మరో పక్క తీవ్ర మంచి నీటి ఎద్దడి తమ గోడు ఎవరికి చెప్పుకోవాలని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత మూడు రోజలుగా నల్లాలు రావడం లేదని మంచి నీరు ఎలా తెచ్చుకోవాలని మహిళలు అంటున్నారు.ఒక్కో కుటుంబానికి రోజుకు పదిహేను నుండి ,ఇరవై బిందెల వరకు నీరు అవసరం ఉంటుందని అలాంటిది ఒకటి ,రెండు బిందెలు ఎలా సరిపోతాయని మహిళలు అంటున్నారు.పూర్తిగా వ్యవసాయ కుటుంబాలైన తమకు పాడి పశువులు ఉన్నాయని పగటి పూట వ్యవసాయ బావుల వద్ద నీరు తాగిస్తున్నామని తిరిగి సాయంత్రం నుండి ఉదయం పది గంటల వరకు నీరు తాపుదామన్నా లేకుండా పోయాయని అంటున్నారు.గ్రామ శివారులోని వ్యవసాయ బోరే తమకు దిక్కయిందని అక్కడి నుండి మంచి నీరు తెచ్చుకోవాల్సి వస్తోందని మహిళలు ఆరోపిస్తున్నారు.ఇంటిల్లి పాది కలసి బిందెలతో నీరు మోసుకుని తెచ్చుకోవాలని ఉదయం కరంటు సమయంలో సైతం ఎండలో మోయాల్సిందేనని మధ్యాహ్నం కరంటు సమయంలో వ్యవసాయ బావి వద్ద నుండి మండె ఎండలో మంచి నీరు తెచ్చుకోవాల్సి వస్తుందని అంటున్నారు.ఇకనైనా అధికారులు 5వ వార్డు ప్రాంతంలో మంచి నీటి నల్లాలు వేసి అందరికీ తాగునీరు అందేలా చూడాలని వేసవి ఎండలను దృష్టిలో పెట్టుకుని వచ్చే మే మాసం ఎండ తీవ్రతను గమనించి తక్షణమే సంబంధిత శాఖాధికారులు మంచి నీటి సౌకర్యం కల్పించాలని మహిళలు కోరుతున్నారు.