YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

జానా జాగ్రత్త... చిన్నా రెడ్డి వార్నింగ్

 జానా జాగ్రత్త... చిన్నా రెడ్డి వార్నింగ్

హైదరాబాద్, మార్చి 20, 
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధి చిన్నారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. టీఆర్‌ఎస్ అడ్డగోలుగా డబ్బులు పంపిణీ చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు ప్రవాహం కారణంగానే తాను ఓడిపోయానని.. డబ్బు లేకపోతే ఎన్నికలను తట్టుకునే పరిస్థితి లేదని ఆయన ఆవేదన చెందారు. డిగ్రీ చదవని వాళ్లకు కూడా ఓటు హక్కు కల్పించారని.. తప్పుడు సర్టిఫికెట్లతో ఓట్లు నమోదు చేశారని ఆరోపించారు.ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్‌కు వేస్తారని భావించామన్నారు చిన్నారెడ్డి. టీఆర్‌ఎస్ పార్టీ దొంగ ఓట్లు నమోదు చేయించిందని.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు టార్గెట్ పెట్టుకొని పని చేశారని ఆరోపించారు. కొన్ని విద్యాసంస్థలు మాస్‌గా ఎన్‌రోల్మెంట్ చేశాయన్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ తప్పుడు విధానాలను అవలంబించాయని.. పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజుల కేసీఆర్ తెలంగాణను తాగుబోతులుగా మార్చారని మండిపడ్డారు. నిరుద్యోగులు డబ్బు కు అమ్ముడుపోయి అధికార పార్టీకి ఓట్లు వేశారని చిన్నారెడ్డి వాపోయారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి ఖరారైన చిన్నారెడ్డి.. కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డిని హెచ్చరించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని జానారెడ్డికి ఆయన సూచించారు. నాగార్జున సాగర్‌లో జానారెడ్డికి పలుకుబడి ఉంది.. కానీ ఎన్నికలను పాత విధానంలో కాకుండా కొత్త విధానంలో ఎదుర్కోవాలని ఆయన అన్నారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా జానా రెడ్డి బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే.పీసీసీ నియామకంపై కూడా చిన్నారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాగర్ ఉప ఎన్నిక తర్వాత కొత్త పీసీసీని ప్రకటిస్తారని ఆయన తెలిపారు. తన ఓటమిపై ఎవరినీ తప్పుబట్టేది లేదని.. కేవలం డబ్బు కారణంగానే తాను ఓడిపోయానని చిన్నారెడ్డి చెప్పారు. రాజకీయాల్లో కొనసాగుతానని.. పార్టీని బలోపేతం చేయడం కోసం పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు.
డబ్బులు పంచలేక...ఓడిపోయానుచిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్, బీజేపీలపై ఆయన అసహనం వెళ్లగక్కారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆయన శనివారం ఎలిమినేషన్‌కు గురయ్యారు. అనంతరం చిన్నారెడ్డి మీడియాతో మాట్లాడారు. పట్టభద్రులు సైతం టీఆర్ఎస్‌కు ఓట్లు అమ్ముకోవటం బాధ కలిగిస్తోందని చిన్నారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం డబ్బులు పంచలేకపోవటం వల్లే తనకు ఓట్లు పడలేదని చిన్నారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు డబ్బులు అడ్డగోలుగా పంచాయని చిన్నారెడ్డి ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల్లో డబ్బు లేనిదే ఎన్నికలను ఎదుర్కొనే పరిస్థితి లేదని ఆయన తేల్చిచెప్పారు. డిగ్రీ చదవని వాళ్లకు ఓటు హక్కు కల్పించారని.. తప్పుడు సర్టిఫికెట్లతో ఓట్లు నమోదు చేశారని చిన్నారెడ్డి ఆరోపించారు. ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. డబ్బు లేకపోతే ఎవరు కూడా ఎన్నికల్లో పోటీచేయవద్దని ఆయన కోరారు.తన పలుకుబడి 32 వేల ఓట్లకే పరిమితం అనుకుంటున్నానని, డబ్బు ఖర్చు చేయటంలో కేసీఆర్‌ను భవిష్యత్‌లో ఎవరు తట్టుకోలేరని ఆయన వ్యాఖ్యానించారు. నాగార్జునసాగర్‌లో జానారెడ్డి మాత్రమే టీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌ను తట్టుకోగలరని చిన్నారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ నాయకత్వం, రేవంత్ రెడ్డి శక్తికి మించి తనకు సహకరించారని ఆయన తెలిపారు. తాగుబోతులు, లంచగొండి రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ నుంచి తెలంగాణను కాపాడుకోవాలని చిన్నారెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు

Related Posts