YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రాజయ్య వర్సెస్ కడియం

రాజయ్య వర్సెస్ కడియం

వరంగల్, మార్చి 22, వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎం ల మధ్య వివాదం ముదురుతోంది.  ఓవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించి టీఆర్ఎస్ అధిష్టానం మాంచి ఊపు మీదుంటే.. మరోవైపు ఉమ్మడి వరంగల్ టీఆర్ఎస్‌లో మాటల మంటలు చెలరేగుతున్నాయి. ఏకంగా ఇద్దరు డిప్యూటీ సీఎంలు పరస్పరం మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. దాంతో ఇద్దరి మధ్య వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. పూర్తి వివరాల్లోకెళితే.. వాళ్ళిద్దరూ ఒకే నియోజకవర్గానికి చెందిన దళిత నాయకులు. అంతేకాకుండా ఈ ప్రజా ప్రతినిధులిద్దరూ ఎలక్షన్ల సమయంలో ఒక్కటైనట్టుగా కనిపిస్తారు. ఆ తరువాత ఒకరిపై ఒకరు మండిపడుతుంటారు. ఎప్పుడూ వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంటుంది. వారే మాజీ ఉప ముఖ్యమంత్రులు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య.వీరిద్దరి మధ్య నెలకొన్ని విభేదాలతో స్టేషన్‌ఘన్‌పూర్‌ టీఆర్ఎస్‌లో వర్గ రాజకీయాలు మరోసారి రచ్చకెక్కాయి. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను ఉద్దేశించి మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. చేతకానివాడు, ఒక్క రూపాయి ఎవరికి సహాయం చేయనివాడు కూడా మాట్లాడుతున్నారంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. చెల్లని రూపాయి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. పనిచేసే వారిని నిరుత్సాహ పరుచడం కాదని, మగాళ్ళు అయితే ఆర్థిక సహాయం చెయాలన్నారు. ‘నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కరి దగ్గర చాయ్ తాగినా, పదవి ఇప్పిస్తాననో, పనులు ఇప్పిస్తాననో రూపాయి తీసుకున్నా.. ముక్కు నేలకు రాస్తాను’ అని కడియం శ్రీహరి సవాల్ విసిరారు. ‘పదవులను, పనులను అమ్ముకుంటూ.. సిగ్గులేకుండా మళ్ళి మాట్లాడుతున్నారు’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘నేత్తిమీద పది రూపాయలు పెడితే రూపాయికి కూడా అమ్ముడు పోనివారు మాట్లాడుతున్నారు’ అంటూ కడియం నిప్పులు చెరిగారు. నియోజకవర్గంలో తాను చేసిన పనులు కనబడట్లేదా? అంటూ నిలదీశారు.ఎమ్మెల్యే రాజయ్యని ఉద్దేశిస్తూ కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చేతకాని వాడు చెల్లని రూపాయి అంటూ రాజయ్యని కడియం శ్రీహరి విమర్శించారు. నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు వసూళ్ళకు పాల్పడినట్టు కనుక నిరూపిస్తే ముక్కు నెలకు రాస్తానని ఆయన అన్నారు. పదవులు అమ్ముకుంటున్నారు, పనులు అమ్ముకుంటున్నారని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నెత్తి మీద పది రూపాయలు పెడితే అమ్ముడు పోనివారు కూడా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే రాజయ్యని ఉద్దేశిస్తూ  ఎద్దేవా చేశారు. మొత్తం మీద స్టేషన్‌ఘనపూర్ నియోజకవర్గంలో ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రుల మధ్య వార్ ముదురుతోంది. నిజానికి గతంలో రాజయ్యకు ఉన్న మంత్రి పదవి తీసేసి మరీ కడియం శ్రీహరికి కేసీఆర్ అప్పగించారు. దీంతో అప్పటి నుండి ఈ వార్ కొనసాగుతోంది అని చెప్పాలి.

Related Posts