డిండి ఎత్తిపోతల పథకంతోపాటు జిల్లాలోని మిగిలిన నీటి పారుదల ప్రాజెక్టుల పరిధిలోనూ భూసేకరణ వేగంగా ముందుకు సాగుతోంది. శ్రీశైలం ఎడమ గట్టు సొరంగం లో భాగంగా చందంపేట మండలం నక్కలగండి వద్ద నిర్మిస్తున్న డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులతోపాటు భూసేకరణ సైతం దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఈ జలాశయం నిర్మాణానికి మొత్తం 854.39ఎకరాలు అవసరం పడుతుందని నిర్ణయించగా.. ఇప్పటి వరకు 705.12ఎకరాలు సేకరించడం విశేషం. కొండమల్లేపల్లి మండలంలో నిర్మాణంలో ఉన్న పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సైతం ఇదే వేగంతో సాగుతోంది. సాగర్ లో లెవెల్, హై లెవెల్ కాల్వల పరిధిలోనూ పెండింగ్లో ఉన్న భూసేకరణ ప్రక్రియ క్రమంగా పూర్తవుతోంది.. దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని సుమారు మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు లక్షలాది మంది దాహాన్ని తీర్చనున్న డిండి ఎత్తిపోతల పథకం భూ సేకరణ వేగంగా సాగుతోంది. పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి డిండి రిజర్వాయర్ ద్వారా చౌటుప్పల్ వరకు సాగునీటిని అందించనున్న ఈ పథకంలో భాగంగా మొత్తం ఐదు రిజర్వాయర్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. డిండి మండలం సింగరాజుపల్లి, దేవరకొండ మండలం గొట్టిముక్కల, చింతపల్లి మండల కేంద్రంతోపాటు కిష్టరాయినిపల్లి, మర్రిగూడెం మండలం శివన్నగూడెంలో మొత్తం ఈ ఐదు రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతోంది. ఇందులో భాగంగా సింగరాజుపల్లి రిజర్వాయర్కు మొత్తం 717.3ఎకరాల భూ సేకరణ అవసరం కాగా.. ఇప్పటివరకు యంత్రాంగం ప్రభుత్వ, ప్రైవేటు, అసైన్డ్ భూములు కలిపి మొత్తం 684.15ఎకరాలు సేకరించింది. ఇంకా కేవలం 33.15ఎకరాలు మాత్రమే సేకరించాల్సి ఉంది. గొట్టిముక్కల రిజర్వాయర్ పరిధిలో 1863.34 ఎకరాలు అవసరం కాగా ఇప్పటికి 1181.27 ఎకరాలు సేకరించింది. చింతపల్లి జలాశయానికి 1691 ఎకరాలకుగాను 498.1 ఎకరాల సేకరణ పూర్తయింది. కిష్టరాయినిపల్లిలో 1611.05 ఎకరాలు.. శివన్నగూడెంలో మొత్తం 3314కు 1737.26 ఎకరాల సేకరణను యంత్రాంగం పూర్తి చేసింది. చింతపల్లి, డిండి వద్ద నిర్మించనున్న ప్రధాన కాల్వల భూసేకరణ సైతం ఇప్పటికే 150ఎకరాలు దాటింది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచీ ప్రాజెక్టులకు ప్రతిపక్షాలు కేసులు, ఆందోళనల రూపంలో అడ్డుపడుతున్నా ప్రభుత్వం వాటన్నింటిని అధిగమిస్తూ ముందుకు పోతున్న కారణంగానే భూసేకరణతోపాటు ప్రాజెక్టుల పనులు వేగంగా సాగుతున్నాయి.