బల్దియాకు చెందిన డిస్ప్లే బోర్డులపై జాగ్రత్త చర్యలు ప్రదర్శించనున్నారు, వాటర్బోర్డు సమన్వయంతో అవసరమైన చోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఎండల వల్ల ఏర్పడే ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు తగిన సూచనలు, సలహాలు అందజేయాలని, దీనిపై ప్రత్యేక ప్రచారం నిర్వహించనున్నారు ముఖ్యంగా వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. వైద్య, ఆరోగ్యశాఖ సమన్వయంతో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు సూచించాలని, ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే తగిన చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు.జీహెచ్ఎంసీ ద్వారా నిర్వహించే భవన నిర్మాణాలు, ముఖ్యంగా స్లాబుల నిర్మాణం, రోడ్లు తదితర సిమెంట్ కాంక్రీట్ పనులను మధ్యాహ్నం సమయంలో తగిన జాగ్రత్తలతో మాత్రమే చేపట్టాలని ఆదేశిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలో సీసీ పనులు చేపట్టడం వల్ల త్వరగా పగుళ్లు వచ్చే ప్రమాదం ఉన్నందున సిమెంట్ పనుల వద్ద నీడ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో మధ్యాహ్నం పనులను వాయిదా వేసుకొని రాత్రి వేళల్లో చేపట్టాలన్నారు. 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నందున సీసీ మిశ్రమం పది నిముషాల్లోనే అది ఆరిపోతుందని చెప్పారు.