హైదరాబాద్ మార్చి 22 వేతన సవరణ (పీఆర్సీ) ప్రకటన కోసం ఆత్రుతగా ఎదురు చూస్తోన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు చెప్పారు. శాసనసభలో ముఖ్యమంత్రి పీఆర్సీపై ప్రకటన చేశారు. ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్ ఇస్తున్నట్లు వెల్లడించారు. అలానే ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని అయన తెలిపారు. కరోనా, ఇతర పరిస్థితుల కారణంగా పీఆర్సీ కొంత ఆలస్యమైందని తెలిపారు. దీనిపై అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని కమిషన్ నివేదిక ఇచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకోసారి పీఆర్సీ ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. సీఎస్ అధ్యక్షతన కమిటీ నివేదికపై అధ్యయనం చేసిందని వెల్లడించారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కూడా సీఎస్ కమిటీ చర్చించిందని గుర్తుచేశారు. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర చాలా ముఖ్యమైందని కేసీఆర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా టీఎన్జీవో సంస్థ పేరు మార్చుకోలేదని కొనియాడారు. టీఎన్జీవో పేరు కూడా ఒక స్ఫూర్తి అని ప్రశంసించారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సౌర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంచుతాం. అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పిస్తాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.