23, 24వ తేదీల్లో ఇండియా, పాకిస్థాన్ మధ్య చర్చలు
న్యూఢిల్లీ మార్చ్ 22
ఇండియా, పాకిస్థాన్ మధ్య మంగళ, బుధవారాల్లో రెండు రోజుల పాటు చర్చలు జరగనున్నాయి. సింధూ నదీ జలాల పంపకం విషయంలో ఈ రెండు దేశాలు చర్చలు జరపనున్నాయి. ప్రతి ఏటా జరగాల్సిన ఈ సమావేశం రెండేళ్ల తర్వాత ఈసారి జరగబోతోంది. నదీ జలాల పంపకం, రెండు దేశాల ఆందోళనలపై అధికారులు చర్చించనున్నారు. లఢాక్లో ఇండియా నిర్మించబోయే పలు జలవిద్యుత్ కేంద్రాలపై పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వీటిపై చర్చించడానికి పాకిస్థాన్ అధికారులు ఇండియాకు వస్తున్నారు.పర్మనెంట్ ఇండస్ కమిషన్ 116వ సమావేశం మార్చి 23, 24వ తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్నట్లు పాకిస్థాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జహీద్ హఫీజ్ వెల్లడించారు. సింధూ నదీ జలాల ఒప్పందం ప్రకారం రెండు దేశాల కమిషనర్లు ప్రతి ఏటా కనీసం ఒక్కసారైనా సమావేశం కావాలి. ఒకసారి పాక్లో, ఒకసారి ఇండియాలో ఈ చర్చలు జరుగుతాయి. జమ్ముకశ్మీర్కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత రెండు దేశాల అధికారులు తొలిసారి సమావేశం కాబోతుండటం గమనార్హం.