న్యూఢిల్లీ మార్చ్ 23
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టబోతున్న మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గగన్యాన్. ఇందులో భాగంగా నలుగురు భారత ఆస్ట్రోనాట్లను తొలిసారి నింగిలోకి పంపనున్నారు. కరోనా మహమ్మారి రాకపోయి ఉంటే ఇప్పటికే ఈ ప్రాజెక్ట్కు అంతా సిద్ధమైపోయి ఉండేది. అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్ ఆలస్యం కాబోతున్నా.. మన ఆస్ట్రోనాట్లు మాత్రం సిద్ధంగా ఉన్నారు. రష్యాలో ఏడాది శిక్షణను వాళ్లు పూర్తి చేసుకున్నారు. గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పూర్తి చేసుకున్న ఇండియన్ గగనాట్లను తాము కలిసినట్లు రష్యన్ స్పేస్ స్టేట్ కార్పొరేషన్ హెడ్ డిమిత్రి రొగోజిన్ చెప్పారు. అంతేకాకుండా భవిష్యత్తులో ద్వైపాక్షిక స్పేస్ ప్రాజెక్టులపై భారత రాయబారితోనూ మాట్లాడినట్లు ఆయన తెలిపారు.భారత ఆస్ట్రోనాట్లకు శిక్షణ కోసం ఇస్రో, రష్యన్ లాంచ్ సర్వీస్ ప్రొవైడర్ గ్లావ్కాస్మోస్ మధ్య జూన్, 2019లో ఒప్పందం కుదిరింది. శిక్షణ పొందినవాళ్లలో నలుగురు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు ఉన్నారు. గతేడాది ఫిబ్రవరి 10న వీళ్ల శిక్షన ప్రారంభమైంది. కొవిడ్ కారణంగా కొన్ని రోజుల పాటు శిక్షణ నిలిచిపోయింది. రష్యాలో శిక్షణ పూర్తి చేసుకున్ ఈ ఆస్ట్రోనాట్లకు ఇండియాలో మాడ్యూల్కు సంబంధించిన శిక్షణ ఇవ్వనున్నట్లు గతంలో ఇస్రో వెల్లడించింది. ఈ మిషన్ కోసం భారత ప్రభుత్వం రూ.10 వేల కోట్లు కేటాయించింది.