విజయవాడ, మార్చి 24,
మాజీ ఐఏఎస్ అదికారి.. ఇటీవల కాలంలో వార్తల్లో ఎక్కువగా ఉంటున్న జగన్ ప్రభుత్వ మాజీ సలహాదారు.. పీవీ రమేష్ రాజకీయ అరంగేట్రం చేయనున్నారనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. అది కూడా ఆయన బీజేపీలోకి చేరతారని ఎక్కువగా ప్రచారం జరుగుతుండడం గమనార్హం. అయితే.. వృత్తి రీత్యా వైద్యుడు అయిన పీవీ రమేష్.. అనంతరం ఐఏఎస్కు ఎంపికయ్యారు. ఈ క్రమంలోనే ఆయన మెరిట్ ప్రాతిపదికన యునెస్కో సహా అనేక అంతర్జాతీయ సంస్థల్లో సేవలు అందించారు. తర్వాత కాలంలో ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్లో 13 సంవత్సరాలు పనిచేశారు. ఈ క్రమంలోనే ఆయనను తర్వాత కాలంలో 2019 జూన్ నుంచి 2020 అక్టోబరు వరకు ప్రభుత్వ అదనపు కార్యదర్శిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. అనంతరం ఆయనను జగన్ ప్రభుత్వం సలహాదారుగా నియమించింది. తర్వాత కాలంలో ఆయనకు.. సీఎంవో ప్రధానాధికారి ప్రవీణ్ ప్రకాశ్కు మధ్య పొసగకపోవడంతో దాదాపు ఆయన నుంచి బాధ్యతలను తప్పించారు. ఈ క్రమంలోనే ఆయనకు సర్కారు పెద్దలకు మధ్య దూరం పెరిగిపోయింది. ఈ క్రమంలో ఇటీవల ఆయన చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపింది.నేరమే అధికారం అయితే..అది ప్రజలను వెంటాడుతుంది. ఊరక కూర్చున్ననోరున్న వాడూ నేరస్థుడే” అంటూ విరసం నేత వరవరరావు రాసిన వాక్యాలను పీవీ రమేష్ ఉటంకించారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసినవేనని పేర్కొనడం గమనార్హం. అయితే.. ఇప్పుడు ఏకంగా ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారనే వాదన మరింత బలంగా వినిపిస్తుండడం గమనార్హం. అది కూడా ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాలంలో రాజకీయాల్లోకి వచ్చేందుకు ఐఏఎస్లు ఎక్కువగా ఇంట్రస్ట్ చూపుతున్నారు.కర్ణాటక ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ.. బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారని.. ఆమెను తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో బీజేపీ సభ్యురాలిగా పోటీకి పెడతారని కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారని.. ఆయనకు కూడా ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండడం గమనార్హం. ఈ క్రమంలో అసలు ఏం జరుగుతుంది? పీవీ రమేష్ నిజంగానే రాజకీయాల్లోకి వచ్చి నిలదొక్కుకుంటారా? ఇప్పుడున్న పరిస్థితిలో ఆయనకు రాజకీయంగా వర్కవుట్ అవుతుందా? అనేది ఆసక్తిగా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.