మే 12న కర్ణాటక రాష్ట్రంలో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అవసరమైన సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి తెలిపారు.
గురువారం సచివాలయంలో కర్ణాటక ఎన్నికలపై పొరుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డిజిపిలు, ఎక్సైజ్ అధికారులతో ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాన కార్యదర్శి జోషి మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల కోసం తెలంగాణ రాష్ట్రం నుండి 800 మంది పోలీస్ సిబ్భంది పంపిస్తున్నామని, సరిహద్దు జిల్లాల్లో చెక్ పోస్ట్ లను పటిష్టం చేయడం జరుగుతుందని కర్ణాటక రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి వివరించారు. శాంతియుతంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి సరిహద్దు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు తగు సూచనలు జారీ చేయాలని సాధరణ పరిపాలన శాఖను ఆదేశించారు.సరిహద్దు జిల్లాలయిన మహబూబ్ నగర్, గద్వాల, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కర్ణాటక ఎన్నికల పోలింగ్ కు 48 గంటల ముందుగానే ఐదు కిలోమీటర్ల పరిధిలో గల లిక్కర్ షాప్ లను మూసి వేస్తామని తెలిపారు.
రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ శాంతిభద్రతల అడిషనల్ డిజిపి జితేందర్ ను నోడల్ అధికారిగా నియమిస్తున్నామన్నారు. నేరస్తుల డాటాను ఎక్స్ చేంజ్ చేసుకోవడం జరుగుతుందని, జైళ్ళ శాఖను అప్రమత్తం చేస్తామన్నారు.
కర్ణాటక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నప్రభ, డిజిపి నీలమణి రాజు మాట్లాడుతూ కర్ణాటకలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి అవసరమైన సహకారాన్ని అందించాలని అభ్యర్తించారు. ప్రశాంత ఎన్నికల నిర్వహణ కోసం సహకారం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియోకాన్ఫరెన్స్ లో జిఏడి ముఖ్యకార్యదర్శి అధర్ సిన్హా, రెవెన్యూ (ఎక్సైజ్) ముఖ్యకార్యదర్శి సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.