న్యూఢిల్లీ, మార్చి 30,
రాష్ట్రంలో రేషన్ అనేది ఓటర్లను ఆకట్టుకునే ప్రధాన అస్త్రం. అయితే త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న పథకాలను తమ హామీల్లో ఇతర రాష్ట్రాల పార్టీల నేతలు గుప్పించడం విశేషంగా కన్పిస్తుంది. ఇప్పటికే తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చారు. అనేక ఉచిత పథకాలతో సహా రేషన్ సరుకులు కూడా తమ ఎన్నికల ప్రచారంలో ప్రధానాస్త్రాలుగా మలుచుకున్నాయి.ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలను స్వీకరించిన తర్వాత అనేక హామీలను అమలు చేశారు. వీటిలో ప్రధానంగా రేషన్ ను ఇంటివద్దకే పంపిణీ చేసే కార్యక్రమం. ఇందుకోసం వేలాది వాహనాలను నిరుద్యోగ యువతకు బ్యాంకు రుణాలిప్పించి కొనుగోలు చేయించింది. వారి చేతనే ఇంటింటికి రేషన్ ను అంద చేయనున్నారు. తాము రేషన్ దుకాణాలకు వెళ్లకుండానే బియ్యాన్ని తమ ఇంటి ముంగిట కు తెచ్చే పథకం ఏపీలో సక్సెస్ అయింది.దీంతో ఈ పథకాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తన ప్రచారంలో ప్రధాన అస్త్రంగా మలచుకున్నారు. తాము అధికారంలోకి మళ్లీ వస్తే ఇంటింటికి రేషన్ ను పంపిణీ చేస్తామని చెప్పారు. పళనిస్వామి అనేక ఉచిత వాగ్దానాలను ఇచ్చారు. ఉచితంగా వాషింగ్ మెషిన్ ఇస్తామన్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. అయితే వీటన్నింటిలో కంటే రేషన్ సరుకులను ఇంటింటికి పంపిణీ చేస్తామన్న వాగ్దానం హైలెట్ గా నిలిచిందిఇక జగన్ బాటలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కూడా నిలిచారు. మమత బెనర్జీ కూడా ఇంటింటికి రేషన్ బియ్యాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఐదు రూపాయలకే భోజనాన్ని మమత బెనర్జీ ప్రకటించారు. గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ ఇస్తామని చెప్పారు. వీటన్నింటితో పాటు ఇంటింటికి రేషన్ బియ్యం కూడా ఇక్కడ హైలెట్ గా నిలిచింది. మొత్తం మీద ఏపీలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ త్వరలోనే దేశ వ్యాప్తంగా విస్తరించే అవకాశాలు కన్పిస్తున్నాయి.