ఏపీలో నగదు అందుబాటులో ఉండడం లేదని, ఏటీఎంలు మూతపడుతున్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. గురువారం అమరావతి ప్రజాదర్బార్ హాల్లో 202వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. బ్యాంకుల నుంచి ప్రజలకు నగదు దొరకని పరిస్థితి ఏర్పడిందని, నగదు కొరత అంశం రాష్ట్ర ఆర్థికాభివృద్ధిపై ప్రభావం చూపుతోందని అన్నారు.నగదు కొరతపై కేంద్ర సర్కారుకి ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలుసార్లు కేంద్రానికి లేఖలు రాశారని యనమల అన్నారు. నోట్ల రద్దు అంశం పెద్దగా ప్రభావం చూపలేదని, నల్లధనం కట్టడికాకపోగా పలు సమస్యలు తలెత్తాయని అన్నారు. నగదు చలామణి అయితేనే ఆర్థిక కార్యకలాపాలు ఉంటాయని, అలా జరిగితే అభివృద్ధి ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు. బ్యాంకుల్లో నగదు లేమిని నివారించాలని అన్నారు.