కోల్ కత్తా, మార్చి 31,
అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలుపుదాం అంటూ సోనియా సహా పది కీలకమైన ప్రతిపక్షాలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం లేఖ రాశారు. ఈ లేఖలో మమత ప్రధానంగా ఏడు అంశాలను లేవనెత్తారు. ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై బీజేపీ చేస్తున్న దాడిని తిప్పికొట్టేందుకు అందరం కలిసి రావాల్సిన సమయం ఆసన్నమైందని ఆ లేఖలో మమత స్పష్టం చేశారు.దేశ ప్రజలకు ఓ విశ్వసనీయ ప్రత్యామ్నాయాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని ఆమె నొక్కి చెప్పారు. బీజేపీ ప్రజాస్వామ్యంపై, సహకార సమాక్య వ్యవస్థపై ఎలా దాడి చేసిందో వివరిస్తూ ఏడు అంశాలను మమత ప్రస్తావించారు. ఈ మధ్యే ఢిల్లీలో స్థానిక ప్రభుత్వం కంటే లెఫ్ట్నెంట్ గవర్నర్కే ఎక్కువ అధికారాలు కట్టబెడుతూ తీసుకొచ్చిన చట్టాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.సోనియాతోపాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే అధినేత స్టాలిన్, శివ సేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే, వైఎస్సార్ కాంగ్రెస్ చీఫ్ జగన్మోహన్రెడ్డి, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి, ఆమ్ ఆద్మీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్లకు మమత లేఖలు రాశారు.బీజేపీ కాకుండా ఇతర పార్టీ వాళ్లు తమ రాజ్యాంగ హక్కులను, స్వేచ్ఛను లేకుండా బీజేపీ చేస్తోందని లేఖలో మమత ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేసి వాటిని మున్సిపాలిటీల స్థాయికి తీసుకెళ్లడానికి బీజేపీ చూస్తోందని ఆమె అన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో ఏక పార్టీ అధికారమే బీజేపీ లక్ష్యమని మమత లేఖ స్పష్టం చేశారు. తృణమూల్ చీఫ్గా మీ అందరితో కలిసి పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనం చేతులు కలిపే సమయం ఆసన్నమైందని మమత లేఖలో చెప్పారు.