హరితహారంలో భాగంగా ప్రతి గ్రామం, మున్సిపాలిటీలలో, నర్సరీలను ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలమేరకు నర్సిరీలకు అవసరమైన స్ధలాలను వారంలోగా ఎంపిక చేయడానికి కార్యచరణ ప్రణాళికను రూపొందించాలని పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖ అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ఆదేశించారు.
గురువారం సచివాలయంలో హరితహారం పై కార్యాచరణ ప్రణాళిక, గ్రామాలు, ముస్సిపాలిటీలలో నర్సరీల ఏర్పాటుపై సి.యస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హరితహారం కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించడం జరిగిందని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీలలో నర్సరీల ఏర్పాటుకు అర ఎకరం భూమికి తక్కువ కాకుండా ఉండాలని కోరారు. వారంలోగా రాష్ట్రంలోని 142 పట్టణ స్ధానిక సంస్ధలు, 12751 గ్రామపంచాయతీలలో భూమి గుర్తింపు, అవసరమైన మౌళిక సదుపాయాలు, మొక్కల తదితర వివరాలను పంపాలన్నారు.
గ్రామ పంచాయతీలలో నర్సరీలకు అవసరమైన సిబ్బంది కేటాయింపు, అవసరమై నిధులు, మొక్కలు, నీటి లభ్యత తదితర అంశాలపై చర్చించారు. గ్రామాలలో నర్సరీల ఏర్పాటుకు గాను గ్రామ కార్యదర్శికి, ఒకరు లేదా ఇద్దరిని గుర్తించి శిక్షణ ఏర్పాట్లకు తగు చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులను సి.యస్ ఆదేశించారు. పట్టణాలలోని అర్భన్ పార్కులలో నర్సరీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. సిబ్భంది శిక్షణకు అవసరమైన ప్రింట్ మరియు ఆడియో విజువల్ మెటీరియల్ ను రూపొందించాల్సిందిగా అటవీ శాఖాధికారులను ఆదేశించారు. పట్టణాల నర్సరీల పర్యవేక్షణకు అర్భన్ ఫారెస్ట్రీ, యంఏయూడి ఓయస్డి శ్రీ క్రిష్ణ ను నోడల్ అధికారిగా నియమించినట్లు సియస్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, పంచాయతీ రాజ్ కమీషనర్ నీతూ ప్రసాద్, హెచ్ ఎండిఏ కమీషనర్ చిరంజీవులు, మున్సిపల్ అండ్ అర్భన్ డెవలప్ మెంట్ డైరెక్టర్ టి.కె.శ్రీదేవి, సి.యం.ఓ. ఓ.ఎస్.డి (హరితహారం) ప్రియాంక వర్గీస్, జి.హెచ్.ఎంసి ఇంచార్జ్ కమీషనర్ భారతి హోళికేరి, పిసిసిఎఫ్ పి.కె.ఝా తదితరులు పాల్గొన్నారు.