YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎన్నారైలే మా బ్రాండ్ అంబాసిడర్లు

ఎన్నారైలే మా బ్రాండ్ అంబాసిడర్లు

ఎన్నారైలే మా బ్రాండ్ అంబాసిడర్లు
-ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ప్రభుత్వంతో అనుసంధానం చేయాలి
-రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సహకరించాలి
-కేసీఆర్ విజన్‌కు పలు రాష్ర్టాలు, కేంద్రం నుంచి అభినందనలు 
-జ్యూరిచ్‌లో ఎన్నారైలతో ముఖాముఖిలో కేటీఆర్
-ప్రభుత్వ పథకాలు..అమలును వివరించిన మంత్రి

తెలంగాణ ఏర్పాటునాటి అయోమయ పరిస్థితి నుంచి తమ ప్రభుత్వం అద్భుతమైన ప్రగతిదిశగా రాష్ర్టాన్ని తీసుకుపోతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారక రామారావు చెప్పారు. బంగారు తెలంగాణ కల సాకారంలో ప్రవాస తెలంగాణవాసులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం గత నాలుగేండ్లలో సాధించిన అద్భుతమైన ప్రగతిని ఎన్నారైలు దశదిశలా చాటాలని కోరారు. ప్రతి తెలంగాణ ప్రవాస భారతీయుడు రాష్ర్టానికి ఒక గుడ్‌విల్ అంబాసిడర్, బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని అన్నారు. ముఖ్యంగా రాష్ర్టాన్ని ఇతర దేశాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు పరిచయం చేసేందుకు, ఆసక్తిగల పారిశ్రామికవేత్తలను తెలంగాణ ప్రభుత్వంతో అనుసంధానం చేసేందుకు ఎన్నారై మిత్రులు కలిసి రావాలని విజ్ఞప్తిచేశారు. నాడు తెలంగాణ ఉద్యమంలో, నేడు సొంత రాష్ట్రంలో ఎన్నారైలది కీలక పాత్ర అని చెప్పారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన మం త్రి కేటీఆర్.. ఈ సందర్భంగా జ్యూరిచ్ నగరంలో సోమవారం తెలంగాణ ఎన్నారైలు ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, పాలసీలు, వాటి అమలువంటి అంశాలతోపాటు.. రాష్ట్ర రాజకీయాల గురించి మంత్రి మాట్లాడారు. దశాబ్దంన్నర క్రితం ఏర్పాటైన రాష్ర్టాలు కూడా ఇంకా పూర్తిగా కుదురుకోని పరిస్థితుల్లో ఉంటే, తెలంగాణ రాష్ట్రం మాత్రం మూడున్నర ఏండ్లలోనే అనేక రంగాల్లో దేశంలోనే ఆదర్శవంతమైన విధానాలతో ముందుకు పోతున్నదని చెప్పారు. తెలంగాణ ప్రజలు ఆకాంక్షించిన లక్ష్యాల సాధన దిశగా ప్రయాణం మొదలైందని అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో బంగారు తెలంగాణ సాధిస్తామని మంత్రి ఉద్ఘాటించారు. మొదట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వారే ప్రస్తుతం అభినందిస్తున్న పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. తమ వద్ద కూడా టీఆర్‌ఎస్‌ను స్థాపించాలంటూ పొరుగు రాష్ట్ర ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయంటేనే తెలంగాణలో పాలన ఎంత జనరంజకంగా సాగుతున్నదో అర్థమవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ విజన్‌కు కేంద్ర ప్రభుత్వంతోపాటు పలు రాష్ర్టాల నుంచి కూడా అభినందనలు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. 

 

Related Posts