విజయవాడ, ఏప్రిల్ 6,
ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతుంది. అయితే ఇంత వరకూ విభజన హామీలు కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు. ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చి చెప్పేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకే ముందుకు వెళుతుంది. అనేక విద్యాసంస్థలు రావాల్సి ఉంది. అయినా జగన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పట్ల ఉదార వైఖరిని ప్రదర్శించడం విమర్శలకు తావిస్తుంది. ఇప్పటికే వైసీపీ ఎంపీలను గొర్రెలుగా విపక్షాలు విమర్శిస్తున్నాయి.జగన్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ఒక మాట చెప్పారు. బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ వచ్చిందని, ఇప్పుడు బతిమాలడం తప్ప భయపెట్టలేమని చెప్పారు. వచ్చే ఎన్నికలలోనైనా బీజేపీకి మెజారిటీ సీట్లు రాకూడదనే కోరుకుంటున్నానని జగన్ అప్పట్లో ఢిల్లీ లో చెప్పారు. ఆ మాట ప్రకారమే జగన్ ఇప్పటి వరకూ బీజేపీ పెద్దలతో సయోధ్యగా వెళుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు మద్దతు తెలుపుతున్నారు.కానీ జగన్ ఇక కేంద్ర ప్రభుత్వం వైఖరిపై నిర్ణయం తీసుకోవాల్సిందేనంటున్నారు. బీజేపీకి లోక్ సభలో మెజారిటీ ఉంది. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. బీజేపీకి నష్టం ఉండదు. బీజేపీ కేంద్ర నాయకత్వం ఇప్పటికే ఏపీపై ఆశలు వదిలేసుకుంది. ఈ నేపథ్యంలో రాజీనామాలు సరికాదన్నది పార్టీలో కొందరి అభిప్రాయం. అయితే ఎన్నాళ్లు ఇలా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని చూసీ చూడనట్లు వదిలేస్తామని ప్రశ్నించే వారుకూడా జగన్ పార్టీలో లేకపోలేదు.నిజానికి ఇప్పటికే కొంత వైసీపీలో అలజడి ప్రారంభమయింది. అయితే రాజకీయ లక్ష్యాల ప్రకారం బీజేపీ, టీడీపీలను కలపకూడదు. అందుకే జగన్ ఆచితూచి నిర్ణయం తీసుకుంటారంటున్నారు. ఆ నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. జగన్ పార్టీ కేంద్ర ప్రభుత్వంలోనూ భాగస్వామిగా లేదు. ఈ పరిస్థితుల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత థర్డ ఫ్రంట్ మమత బెనర్జీ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటే జగన్ దీదీకి సపోర్టు చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే దీనిపై స్పష్టత రావాలంటే మే మొదటి వారం వరకూ ఆగాల్సిందే