అసోం ఏప్రిల్ 6
సాధారణంగా ఎన్నికల్లో ఓటింగ్ పోల్ శాతం అనేది 90 దాటితే అనుమానం వస్తుంది. అసలు 90 శాతం ఓటింగ్ ఎలా జరిగింది అంటూ అనేక రకాల విమర్శలు చేస్తుంటారు. అలాంటిది ఓ ఊర్లో 90 ఓట్లుంటే 181 ఓట్లు పోలయ్యాయి. దీన్ని ఏమంటారో అందరికి తెలిసిందే. తాజాగా అసోం ఎన్నికల్లో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ పోలింగ్ బూత్లో మొత్తం 90 ఓట్లుంటే.. అక్కడ ఏకంగా 181 ఓట్లు పోలయ్యాయి. అంటే 200 శాతం ఓటింగ్ జరిగింది.ఈ ఘటన సోమవారం వెలుగులోకి రావడంతో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఇక్కడ ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యం పూర్తిగా కొట్టొచ్చినట్టు కనబడుతోంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వ్యవహరించినందుకు ఆరుగురు పోలింగ్ అధికారులపై ఎన్నికల సంఘం సస్పెండ్ వేటు వేసింది. ఏప్రిల్ ఒకటో తేదీన రెండో దశ పోలింగ్ లో భాగంగా.. దిమా హసవో జిల్లాలోని ఓ బూత్ లో ఎన్నికలను నిర్వహించారు. అక్కడ 90 ఓట్లు ఉండగా.. 181 ఓట్లు పోలయ్యాయి. ఈ విషయం వెలుగులోకి రావడంతో అక్కడ విధులు నిర్వర్తించిన అయిదుగురు ఎన్నికల సిబ్బందిని జిల్లా ఎన్నికల అధికారి సస్పెండ్ చేశారు. ఆ బూత్ లో రీపోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఇదిలా ఉండగా ఈవీఎంను స్ట్రాంగ్ రూమ్ కు బీజేపీ అభ్యర్థి భార్య వాహనంలో తరలించిన ఘటన కూడా అసోంలోనే చోటుచేసుకున్న విషయం తెలిసిందే.