బీజేపీది గెలుపు పోరాటం.. కాంగ్రెస్ పార్టీది జీవన్మరణ యుద్ధం! ఆధిపత్యం కోసం చేస్తున్న పోరు ఒకరిదైతే.. అవమానాలను దిగమించి ప్రత్యర్థికి సరైన జవాబు చెప్పాలని చేస్తున్న రణం మరొకరిది! రెండు జాతీయ స్థాయి పార్టీలు నువ్వా నేనా అంటూ తలపడుతూ దేశ రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. ఈ పోరాటంలో విజయమే అంతిమ లక్ష్యంగా ఇరు పార్టీల నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. యుద్ధంలో గెలుపోటములు సహజమే అయినా.. కర్ణాటకలో మాత్రం ఓటమి అనేది తమ దరిదాపుల్లోకి రాకుండా ఉండేందుకు శ్రమిస్తున్నారు. మరి ఎవరో ఒకరు ఓటమిని అంగీకరించక తప్పదు. మరి ఈ ఓటమి ప్రభావం ఏ రాజకీయ పార్టీపై ఎలా ఉండబోతోంది.. ఈ ఫలితాల తర్వాత బీజేపీ, కాంగ్రెస్లో ఎలాంటి గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయి? అనే చర్చ మొదలవుతోంది.నార్త్లో ఎలా ఉన్నా సౌత్లో బీజేపీకి పట్టు దొరకడం లేదు. ఇక్కడ పట్టుకోసం ఆ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. వాళ్లకు ఇక్కడ ఆశలు ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న పెద్ద రాష్ట్రం కర్ణాటక ఒక్కటే. ఇక్కడ కూడా అధికారం కోల్పోతే.. పూర్తిగా కాషాయం అయిన దేశ మ్యాప్ను బీజపీ ఆవిష్కరిస్తుంది. అందుకే కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. నిజానికి మూడు నెలల వరకు కాంగ్రెస్ కు మరీ అంత పాజిటివ్ వేవ్ ఉందని ఎవరూ అనుకోలేదు. సిద్ధరామయ్య సంక్షేమ పథకాలు ఓకే.. కానీ వివాదాలకు మాత్రం కొదవ లేదుకర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో కీలకమైన మార్పులు తేవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎదురు లేని విజయాలతో సాగుతున్న బీజేపీ, సాధారణ ఎన్నికల ముందు డీలా పడి తిరిగి బలాన్ని పుంజుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్.. పందెం కోళ్లలా తలపడుతున్నాయి. ఇటీవల గుజరాత్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి చావు తప్పి కన్ను లొట్టబోయింది. కాంగ్రెస్ ఇచ్చిన పోటీకి బీజేపీ నాయకులకు చెమటలు పట్టాయి. అయితే ఆ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో బీజేపీ విజయం సాధించినా నైతిక విజయం మాత్రం కాంగ్రెస్దనని అంతా భావించారు. ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురవుతోంది.పరిస్థితులు అనుకూలంగా లేవని తెలుసుకున్న బీజేపీ.. ముందుగా వద్దనుకున్న గాలి జనార్దన్ రెడ్డిని కూడా దగ్గరకు తీసుకుంది. కర్ణాటకలో ఎన్నికల్లో ఓడిపోతే ఆ ప్రభావం ఏడాది చివరిలో జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్తాన్ ఎన్నికలపై పడుతుంది. అక్కడి బీజేపీ ప్రభుత్వాలపై తీవ్ర వ్యతిరేకత ఉందని ఉప ఎన్నికల్లో వెల్లడయింది. కర్ణాటకలో ఓడిపోతే అక్కడా ఓటమిని ఖరారు చేసుకోవాల్సి వస్తుంది. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే రాజకీయ సమీకరణాలు మాత్రం వేగంగా మారిపోతాయి. కాంగ్రెస్ తో జట్టు కట్టేందుకు మరికొన్ని పార్టీలు ముందుకు వస్తాయి. బీజేపీని వదిలేందుకు మరిన్ని పార్టీలు సిద్ధమవుతాయి. ఒక్కసారి గ్రాఫ్ పడిపోవడం అంటూ ప్రారంభమైతే ఆపడం ఎవరి తరం కాదు. మోడీ ఇమేజ్ కూడా ఆ పరిస్థితులకు అతీతమయ్యే అవకాశం లేదు. అందుకే కర్ణాటక ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ లకు క్వార్టర్ ఫైనల్లాంటివి. ఇక్కడ గెలవకపోతే మెరిట్ పాయింట్లకు తేడా పడి క్లైమాక్స్ ఫైట్ లో ఓటమికి బీజం పడినట్లవుతుంది.కర్ణాటకలో కావాల్సింది కుల, మత సమీకరణలే. ఈ విషయంలో సిద్ధరామయ్య బీజేపీని మించిపోయారు. ఉప ప్రాంతీయ వాదంతో ప్రత్యేక జెండాను రూపొందించారు. లింగాయత్ లను ప్రత్యేక మతహోదా పేరుతో ఆకట్టుకున్నారు. బీజేపీ ఉత్తరాది పార్టీ అనే భావన పెంచేలా బీజేపీ తరహా రాజకీయాలు చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ఇప్పుడు ఫ్రంట్ రన్నర్ గా ఉంది. బీజేపీ ఇప్పటి వరకు తిరుగులేని విజయాలు నమోదు చేసింది. కానీ కర్ణాటకలో ఓడిపోతే ఆ విజయాల్ని బీజేపీ కార్యకర్తలు కూడా గుర్తించని పరిస్థితి ఉంది. అందుకే బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది.