కోల్ కత్తా, ఏప్రిల్ 10,
పశ్చిమ బెంగాల్లో ఆడియో టేపుల కలకలం రేగింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎన్నికల వ్యూహకర్తప్రశాంత్ కిషోర్ మాట్లాడిన ఆడియో టేపులు బీజేపీ నేతలు బయటపెట్టడం సంచలనంగా మారింది. కొంతమంది జర్నలిస్టులతో మమతా వ్యూహకర్త పీకే మాట్లాడినట్లు ఉన్న ఆడియోలను బీజేపీ సోషల్ మీడియా వింగ్ ట్వీట్ చేసి వైరల్ చేసింది. బెంగాల్లో బీజేపీదే విజయమని ప్రశాంత్ కిషోర్ ఒప్పుకున్నారంటూ బీజేపీ సోషల్ మీడియా చీఫ్ అమిత్ మాల్వియా సంచలన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ బెంగాల్ ఎన్నికల్లో హీట్ పుట్టిస్తోంది. క్లబ్ హౌస్లో మీడియాతో చిట్ చాట్ చేస్తూ ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు బయటికి పొక్కాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీదే విజయమని.. టీఎంసీ సర్వేల్లోనూ అదే ఫలితం వచ్చిందని పీకే స్వయంగా ఒప్పుకున్నారంటూ బీజేపీ సోషల్ మీడియా హెడ్ అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు. పీకే మాట్లాడినట్లు చెబుతున్న ఆడియో టేపులను ఆయన షేర్ చేశారు. ‘‘ బెంగాల్ ప్రజలు హోదీకి ఓటేశారని.. బెంగాల్ జనాభాలో 27 శాతంగా ఉన్న ఎస్సీలు బీజేపీకి అండగా నిలిచారని పీకే అన్నారు. మతువాలు అందరూ బీజేపీకే ఓటేశారని.. కాషాయ పార్టీకి బూత్ లెవల్ వరకూ కేడర్ ఉంది.ఇప్పటి వరకూ వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ, మమతా నేతృత్వంలోని టీఎంసీ బెంగాల్ ముస్లింలను సంతృప్తి పరిచేందుకు మాత్రమే ప్రయత్నించాయి. అది కూడా ఎన్నికల్లో ప్రభావం చూపింది. అదే పెద్ద చిక్కు.. ప్రజల్లో ఆగ్రహానికి దారితీసింది. ప్రధాని మోదీ బెంగాల్లో బాగా పాపులర్ అయిపోయారని.. అందులో ఎలాంటి సందేహం లేదు. అంతేకాకుండా టీఎంసీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. ఎస్సీ ఓటర్లు బీజేపీకి ప్లస్ అయ్యారు.’’ అంటూ పీకే మాట్లాడిన ఆడియో టేపులను మాల్వియా ట్వీట్ చేశారు. అవి వైరల్గా మారడంతో బెంగాల్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అది కూడా నాలుగోదశ ఎన్నికలు జరుగుతున్న వేళ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.జర్నలిస్టులతో మాట్లాడిన ఆడియో టేపులు లీక్ అవడంపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వెంటనే స్పందించారు. బీజేపీకి తన స్టైల్లో సమాధానమిచ్చారు. తమ సొంత పార్టీ నాయకుంటే కంటే బీజేపీ తన వ్యాఖ్యలను సీరియస్గా పరిగణిస్తున్నందుకు సంతోషిస్తున్నానన్నారు. బీజేపీ నేతలకు ధైర్యముంటే జర్నలిస్టులతో జరిగిన మొత్తం సంభాషణ బయటపెట్టాలని.. అంతేకానీ తమకు నచ్చిన కొన్ని పాయింట్లను కాదని ఆయన అన్నారు. బీజేపీ బెంగాల్లో వంద మార్కు దాటలేదని.. వంద సీట్లను దాటలేదని మరోసారి చెబుతున్నానని పీకే ట్వీట్ చేశారు.