నల్గొండ జిల్లాల్లో పారిశుద్ధ్య కార్మికుల సమ్ము ఐదో రోజుకు చేరింది. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చినా ముందస్తు చర్యలు తీసుకోవడంలో యంత్రాంగం విఫలమైంది. అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ పట్టణంలో నెహ్రూగంజ్, ప్రకాశంబజారు, ఎస్పీటీ మార్కెట్, రామగిరి, పాతబస్తీ, మాస్కాంప్లెక్స్, హైదరాబాద్ రోడ్డు, దేవరకొండరోడ్డు ప్రాంతాల్లో చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. వాటిల్లో పందులు సంచరిస్తూ భయకంపితులను చేస్తున్నాయి. పర్యవేక్షించాల్సిన అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అవసరమైతే కూలీలను ఏర్పాటు చేసి చెత్తను తరలించే ఏర్పాట్లు చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఇతర పురపాలికల్లోని అధికారులు ఇదే ధోరణిని అవలంబిస్తున్నారు నల్గొండ జిల్లాలో పురపాలికలు, నగర పంచాయతీల్లో నిత్యం 230 టన్నుల చెత్త పోగవుతుంది. కార్మికుల విధులు బహిష్కరణతో చెత్త సేకరణ ఆగిపోయింది. నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరి, కోదాడ, పురపాలికలతోపాటు హుజూర్నగర్, దేవరకొండల్లో పూర్తి స్థాయిలో కార్మికులు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె చేస్తున్నారు. ఒక్క సూర్యాపేటలో మాత్రం తెరాస అనుబంధ కార్మిక సంఘం సమ్మెకు దూరంగా ఉంది. ఇక్కడ రోజుకు 72 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. దీంతో అక్కడ సమ్మె ప్రభావం పెద్దగా కనిపించలేదు. మిగతా ప్రాంతాల్లో పారిశుద్ధ్య సేవలు నిలిచిపోయాయి.