బీజేపీ లెక్క తేలినట్టేనా
తిరుపతి, ఏప్రిల్ 12,
వచ్చే శాననసభ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ముందే పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించనుంది. ఈ మేరకు సంకేతాలు అందాయి. సోము వీర్రాజు వ్యాఖ్యలు ఇందుకు బలపరుస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఏపీలో బీజేపీకి బలం లేదని తేల్చాయి. అలాగే జనసేనకు తమ కంటే ఓటు బ్యాంకు ఉందని బీజేపీ గుర్తించింది.బీజేపీ ఎక్కడో తప్ప ముందుగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే సంప్రదాయం లేదు. కేరళ తరహాలో బీజేపీ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే ముందుగా సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ కేరళ మినహా ఎక్కడా బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. కేరళలో మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. అలాగే ఏపీలోనూ బీజేపీ బలహీనంగా ఉండటంతో పవన్ కల్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ముందుగానే ప్రకటించాలని బీజేపీ నాయకత్వం డిసైడ్ అయింది.పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే హైప్ వస్తుందని బీజేపీ సయితం భావిస్తుంది. ఇప్పటి వరకూ బీజేపీ పవన్ కల్యాణ్ ను పెద్దగా పట్టించుకోలేదు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక విషయంలోనూ పవన్ కల్యాణ్ పార్టీకి కాకుండా బీజేపీయే అభ్యర్థిని ప్రకటించింది. దీంతో ఆయనకు భవిష్యత్ ఉంటుందని భరోసా ఇచ్చే కార్యక్రమంలో భాగంగా కేంద్ర నాయకత్వం ఈ రకమైన సంకేతాలను ఇస్తుంది.తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపోటములను పక్కన పెడితే పవన్ కల్యాణ్ పక్కన లేనిదే తాము సోదిలో కూడా ఉండమని బీజేపీ ఆలస్యంగానైనా గ్రహించింది. అందుకే ఆయనను దువ్వే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రధానంగా కాపు సామాజికవర్గంతో పాటు పవన్ కల్యాణ్ అభిమానులు కులాల, మతాలకు అతీతంగా ఈసారి తమకు అండగా నిలుస్తారని భావించి పార్టీ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. మొత్తం మీద పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి బీజేపీ మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది.