కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసిన నాటి నుంచి ఆసరా లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పటం లేదు. ప్రభుత్వం ప్రతి నెల తపాలాశాఖ ఖాతాలో పింఛను నిధులు జమ చేస్తోంది. బ్యాంకుల్లో నగదు కొరత ఏర్పడటంతో తపాలాశాఖకు డబ్బులు అందజేయడం లేదు.
ప్రతి నెల ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నా ప్రభుత్వం సమస్య పరిష్కారానికి చొరవ చూపటం లేదు. ఆసరా లబ్ధిదారులకు ప్రతి నెల ఒకటో తేదీన పింఛను డబ్బులు అందించాలని పాలకులు సంబంధిత అధికారులను ఆదేశించారు. అది అమలుకు నోచుకోవటం లేదు. నెల ముగుస్తున్నా ఇప్పటికీ ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారులకు పింఛను చేతికంద లేదు. సకాలంలో డబ్బులు అందకపోవటంతో వారి జీవన విధానంలో ఒడుదొడుకులు ఎదురవుతున్నాయి. చాలా మంది వృద్ధాప్య, దివ్యాంగ పింఛనుదారులు ప్రతి నెల వచ్చే డబ్బులతో ఔషధాలు కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో వీరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని సకాలంలో డబ్బులు అందజేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ప్రభుత్వం మార్చి నెల చివరలో పింఛను నిధులు విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాకు మొత్తం రూ.43 కోట్లు తపాలాశాఖలో జమ చేసింది. బ్యాంకులు వెంటనే నగదును అందిస్తే ఏప్రిల్ మొదటివారంలో పంపిణీ పూర్తయ్యేది. బ్యాంకుల్లో నగదు కొరతతో తపాలాశాఖ సిబ్బందికి నగదు ఇవ్వటం లేదు. దీంతో పథకం అమలు అస్తవ్యస్తంగా మారింది. 2 ప్రభుత్వ పెద్దలు స్పందించి ప్రతి నెల డబ్బులు విడుదల కాగానే బ్యాంకర్లతో మాట్లాడి ఇప్పిస్తే తప్ప పరిస్థితిలో మార్పు రాదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు.ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని బ్యాంకులు తపాలాశాఖకు నగదు ఇవ్వటం లేదు. అయితే ప్రభుత్వం లబ్ధిదారుల వ్యక్తిగత ఖాతాల్లో జమ చేస్తే సమస్య ఇంత తీవ్రంగా ఉండదు. లబ్ధిదారులు చిన్న మొత్తంలో డబ్బులు తీసుకుంటుండటంతో బ్యాంకులు పెద్దగా ఇబ్బందులకు గురి చేయకుండా డబ్బులను అందజేస్తారు. కానీ ఈ విధానం జిల్లాలో సంపూర్ణంగా అమలు కావటం లేదు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో అమలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల వారికి మాత్రం తపాలాశాఖ ద్వారా డబ్బులు పంపిణీ చేస్తున్నారు.