సిద్దిపేట ఏప్రిల్ 12
తెలంగాణ పోలీసులు శాంతిభద్రతలను సమర్థంగా నిర్వహిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారని ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పుతున్నారని చెప్పారు. సిద్దిపేట అర్బన్ పరిధిలో నూతనంగా నిర్మించిన త్రీ టౌన్ పోలీసు స్టేషన్ను కమిషనర్ జోయల్ డేవిస్తో కలిసి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. సిద్ధిపేట పట్టణం చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నది. పెరిగిన అవసరాలను దృష్టిలో పెట్టుకుని త్రీ టౌన్ పోలీసు స్టేషన్ను నిర్మించామని స్పష్టం చేశారు. ప్రజలు పోలీసుల్లో భాగమే.. పోలీసులు ప్రజల్లో భాగమే అన్న రీతిలో గుణాత్మకమైన మార్పు తెచ్చి ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లా ఏర్పాటు, పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు కావడం, మల్లన్నసాగర్, రంగనాయక్ సాగర్ నిర్వాసితులు ఇక్కడ స్థిరపడటం, పరిశ్రమలు ఏర్పాటుతో పట్టణం వేగంగా అభివృద్ధి సాధిస్తున్నది అని పేర్కొన్నారు. త్రీ టౌన్ పోలీసు స్టేషన్ ముఖ్యమైనది. కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్, మెడికల్ కళాశాల, ఐటీ హబ్, సిద్దిపేట ఇండస్ట్రీయల్ ఎస్టేట్, జిల్లా కోర్టు భవనాలు, ఇవన్నీ ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తాయన్నారు.కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ నుంచి మానకొండూర్ పోలీస్ స్టేషన్ 80 కి.మీ. వరకు రాజీవ్ రహదరిపై మరో పోలీస్ స్టేషన్ లేదని సిద్దిపేట 3వ టౌన్ రాజీవ్ రహదారిపైనే ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాలు పెద్ద ఎత్తున రాజీవ్ రహదారిపై ఏర్పాటు చేశామని తెలిపారు. అద్భుతమైన ఫలితాలను సీసీ కెమెరాలు అందిస్తున్నాయని స్పష్టం చేశారు. సఖి సెంటర్, ఉమెన్స్ పోలీస్ స్టేషన్, షీ టీమ్స్ భరోసా కేంద్రం, చైల్డ్ కోర్టు ఇవన్నీ ఒకే కాంప్లెక్స్ లో త్వరలోనే ఏర్పాటు చేస్తామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.